Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీని వాలంటీర్ల ద్వారా చేయవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈసీ ఆదేశాల మేరకు ఈ నెల మొదటి వారంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ చేపట్టారు. దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మాత్రం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇళ్ల వద్దనే పంపిణీ చేశారు.
అసలే వేసవి కాలం, ఎండ తీవ్రత కారణంగా పింఛన్ దారులు గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల కోసం పడిగాపులు పడటంతో ఇబ్బందులు పడ్డారు. పింఛన్ల పంపిణీ అంశంపై అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం జరిగింది. ఫించన్ దారుల ఇబ్బందులకు కారణం మీరంటే మీరని రెండు పార్టీలు పరస్పరం విమర్శించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల టీడీపీ నేతల బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ను కలిసి ఫించన్ దారులకు నేరుగా గ్రామ సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులతో నేరుగా ఇళ్ల వద్దనే పింఛన్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించాలని కోరారు. అయితే సీఎస్ వద్ద నుండి స్పష్టమైన హామీ రాకపోవడంతో సచివాలయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదే అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పింఛన్ దారులకు ఇబ్బందులు కలగకుండా మే నెల 1వ తేదీ నుండి పంపిణీ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో ఇవేళ సీఎస్ పింఛన్ల పంపిణీపై కీలక ఆదేశాలు ఇచ్చారు. మే 1వతేదీన అందరికీ పింఛన్లు పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాంకు ఖాతాలు లేని వారికి ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. బ్యాంకు ఖాతాలు ఉన్న వారికి మాత్రం వారి ఖాతాల్లో మే 1న జమ చేయాలని ఆదేశించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో సీఎస్ జవహర్ రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఏప్రిల్ నెల పింఛన్లు మే 1న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ తెలిపారు. పింఛన్ దారులు గ్రామ, వార్డు సచివాలయాల వద్దకు రానవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధాప్య, వితంతు, వికలాంగ తదితర 16 రకాల పింఛనుదారులలో 75 శాతం మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, వారికి పింఛన్లు మే ఒకటో తేదీనే వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయడం జరుగుతుందని చెప్పారు.
బ్యాంక్ ఖాతాలు లేని వారితో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, దివ్యాంగులు, బెడ్ రీడెన్ వారికి వారి ఇళ్ల వద్దనే మే 1 నుండి 5 తేదీ వరకు సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కావున పించన్ దారులు ఎవ్వరూ పింఛన్ల కోసం సచివాలయాల వద్దకు రానవసరం లేదని అన్నారు. ఇదే విధంగా మే నెల పింఛన్లు కూడా జూన్ 1 వ తేదీనే పింఛన్ దారుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని శశిభూషణ్ కుమార్ తెలిపారు. ఏపీలో 65,49,864 మందికిపైగా పింఛన్ల పంపిణీ చేయాల్సి ఉంది. ఇందుల 48.92 లక్షల మందికి బ్యాంకు ఖాతాల్లో పింఛన్ మొత్తాన్ని జమ చేస్తారు. మిగిలిన వారికి ఇళ్ల వద్దనే పంపిణీ చేయనున్నారు.
YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్