త్రిబుల్ ఆర్ అంటూ గత ఐదు సంవత్సరాలుగా సోషల్ మీడియాలో నరసాపురం మాజీ ఎంపీ కనుమూరు రఘురాం కృష్ణంరాజు ఏ స్థాయిలో హల్చల్ చేశారు ? ఎలా వైరల్ అయ్యారు చూశాం. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్న రఘురామ ఎన్నికల ముందు చివరి క్షణంలో వైసీపీ కండువా కప్పుకుని నరసాపురం పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు ఎంపీగా గెలిచిన ఏడాది వరకు రఘురామ వైసీపీ అధిష్టానంతో సన్నిహితంగా ఉన్నారు. అయితే ఏడాదికే ఆయన జగన్ను విభేదించి పార్టీకి దూరం అయ్యారు. ఆ తర్వాత పార్టీ కూడా రఘురామును పట్టించుకోవడం మానేసింది.
నాలుగేళ్ల పాటు ఢిల్లీలో ఉంటూ రచ్చబండ పేరుతో జగన్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ నానా రచ్చ రచ్చ చేశారు. ఆ తర్వాత ఆయన టిడిపి – జనసేనకు బాగా దగ్గరయ్యారు. ప్రతిపక్షానికి అధికార పార్టీ ఎంపీ విమర్శలు చేయడం కూడా రాజకీయంగా లాభంగా మారింది. దీంతో ఆయనకు విపక్ష కూటమి నుంచి మంచి ప్రోత్సాహం దక్కింది. చివరకు రఘురామ అరెస్టు తదనంతర పరిణామాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి పెంచేలా చేశాయి. ఇప్పుడు రఘురామ టిడిపి – జనసేనతో పాటు బిజెపికి కూడా సహితంగా ఉంటున్నారు. మూడు పార్టీలతోనూ సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. రఘురామ కూడా తాను వచ్చే ఎన్నికలలో నరసాపురం ఎంపీగానే పోటీ చేస్తాను అని.. అది కూడా కూటమి తరపున పోటీ చేస్తాను అంటున్నా అది ఏ పార్టీ అన్నది క్లారిటీ ఇవ్వటం లేదు.
టిడిపి అధినేత చంద్రబాబు ఆయనకు నరసాపురం టికెట్ ఇస్తారు అని నిన్నటి వరకు ప్రచారం జరిగింది. దానికి జనసేన కూడా ఓకే చెప్పింది అని చెప్పుకున్నారు. ఇటీవల తాడేపల్లిగూడెం సభలో కూడా రఘురామ తాను మళ్ళీ నరసాపురం ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు. పొత్తులో బిజెపికి నరసాపురం ఎంపీ టికెట్ ఇస్తే ఆయన బిజెపి తరఫున పోటీ చేయవచ్చని అంటున్నారు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. మెగా బ్రదర్ నాగబాబు గత ఎన్నికలలో నరసాపురం నుంచి పార్లమెంటుకు పోటీచేసి ఓడిపోయినా ఏకంగా 2,70,000 ఓట్లు తెచ్చుకున్నారు. ఈసారి పొత్తులో భాగంగా నాగబాబు ఎలాగైనా ఎంపీగా గెలిచి పార్లమెంటుకు వెళ్లాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
పవన్ కూడా తన అన్న పార్టీ కోసం చేసిన సేవలు.. ఐదేళ్లపాటు పడిన కష్టం గుర్తించి పార్లమెంటు టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. తొలి జాబితాలో అనకాపల్లి అసెంబ్లీ టిక్కెట్ జనసేనకు ఇచ్చారు. నాగబాబు ముందుగా అనకాపల్లి నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని అనుకున్నారు. అయితే అక్కడ తెలుగుదేశం నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. అనకాపల్లి అసెంబ్లీతో పాటు పార్లమెంటు సీటు రెండు జనసేనకు ఎలా ? ఇస్తారని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.
అనకాపల్లి ఎంపీ టికెట్ ని టిడిపికి ఇచ్చేసి నరసాపురం నుంచి పోటీ చేసేందుకు జనసేన సిద్ధపడుతుందని అంటున్నారు. పొత్తులో భాగంగా నరసాపురం నుంచి నాగబాబు పోటీ చేస్తే భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయం. వాస్తవానికి ఇక్కడ జనసేనకు సంస్థగతంగా మంచి బలం ఉంది. మరి నాగబాబు నరసాపురం నుంచి పార్లమెంటుకి పోటీ చేస్తే అప్పుడు రఘురామ పరిస్థితి ఏంటి ?అన్నది అంతు పట్టటం లేదు. ఒకవేళ నరసాపురం చేసే ఛాన్స్ రఘురామకు దక్కకపోతే ఆయన మాజీ ఎంపీగానే ఉండాల్సింది అంటున్నారు. ఏది ఏమైనా నాగబాబు అనకాపల్లి నుంచి నరసాపురం కు షిఫ్ట్ అయితే రాజు గారి పొలిటికల్ కెరీర్ గందరగోళం లో పడినట్టే అవుతుంది.