ఏపీలో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. అధికార పక్షం వైసిపితో పాటు ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఒక చిక్కు వచ్చి పడింది. వైసీపీ లేదా తెలుగుదేశం పార్టీ పిలిచి సీటు ఇస్తాం అంటే పోటీ చేసేందుకు చాలా మంది రెడీగా ఉంటారు. ఎమ్మెల్యే అంటే పోటీకి ఒక సీటుకు ఐదారుగురు రేసులో ఉంటున్నారు. అదే ఎంపీ అనేసరికి పక్కకు వెళ్ళిపోతున్నారు.. రెండు పార్టీలకు ఎంపీ అభ్యర్థుల కొరత చాలా ఎక్కువగా కనిపిస్తోంది. వాస్తవంగా చూస్తే ఎంపీ పదవి కంటే గొప్పది లేదు.. ఎమ్మెల్యేగా చేయమంటే గతంలో ఎంపీగా చేసిన వారు నో చెప్పేవారు. ఒక విధంగా దానిని డిమోషన్ గా భావించేవారు.
అయితే ఇప్పుడు ఎంపీలుగా ఉన్నవారు సైతం ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అదే ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపుతామంటే మాకు వద్దు బాబు అని దండం పెడుతున్నారు. రెండు పార్టీలలోను ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో మాదిరిగా ఎంపీలకు ఎలాంటి అధికారాలు, నిధులు లేవు అని ప్రచారంలో ఉండటమే. పైగా ప్రాంతీయ ప్రాంతీయ పార్టీల ఎంపీలకు కేంద్రంలో ఎలాంటి గుర్తింపు ఉండటం లేదు. ఇటు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు అస్సలు వాళ్ళను నియోజకవర్గంలో అడుగుపెట్టనీయటం లేదు.. కేంద్రంలో గత పది యేళ్ల మోడీ పాలన తీసుకుంటే ఎంపీలకు పెద్దగా పవర్స్ లేవు అంటున్నారు.
వారు ఎలాంటి ఇతర ఇతర ప్రయోజనాలు పొందకుండా కట్టడి చేశారు అని అంటున్నారు. దీనికి తోడు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పెట్టే ఖర్చులు ఎంతో వ్యయ ప్రయాసలు పడినా చివరికి లోకల్ గా కూడా పవర్ ఉండటం లేదు. ఢిల్లీలో కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు.. అందుకే చాలామంది ఎంపీ కంటే ఎమ్మెల్యే మేలు కడుపులో చల్ల కదలకుండా హాయిగా లోకల్ గా పని చేసుకోవచ్చు.. అదృష్టం కలిసి వస్తే మంత్రి కూడా కావచ్చు.. సొంత జిల్లాలో చక్రం తిప్పవచ్చు.. ఇక ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో తమకు తిరుగులేదు తాను చెప్పిందే వేదం తామే హీరోలుగా ఉండవచ్చు అని అనుకుంటున్నారు.
అందుకే అధికార వైసిపితో పాటు ఇటు ప్రతిపక్ష టీడీపీకి కూడా భూతద్దంలో పెట్టి వెతికినా సరైన ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదు. ఏపీలో మొత్తం 25 సీట్లలో చాలా వరకు అభ్యర్థులను చూసుకుంటున్నా కొన్ని కీలక స్థానాల్లో మాత్రం ఎవ్వరు ఫైనల్ కానీ పరిస్థితి. వైసీపీ కంచుకోటగా ఉన్న కర్నూలు ఎంపీ సీటుకు కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. చివరకు జగన్ హిందూపురం పార్లమెంటు సీటుకు పొరుగు రాష్ట్రం కర్ణాటక కు చెందిన శాంతను తీసుకువచ్చి పార్టీ కండువా కప్పి ఆమెకు సీటు ఇచ్చారు. మంత్రిగా ఉన్న గుమ్మలూరు జయరాంకు ముందు కర్నూలు ఎంపీ సీటు ఇస్తే ఆయన వద్దు అని దండం పెట్టి మరి టిడిపిలోకి అయ్యారు.
విజయనగరం, విశాఖ లాంటి చోట్ల ఎవరు దొరకక చివరకు మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, ఆయన భార్యకు రెండు ఎంపీ టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి. రాజమండ్రి – నరసాపురం పార్లమెంటు స్థానాలకు కూడా వైసీపీకి ఎవరు దొరకక సామాజిక కోణంలో ఎవరికి తెలియని వారికి ఎంపీ టికెట్లు కట్టపెట్టేశారు. టిడిపిలోనూ చాలా నియోజకవర్గాలలో అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. టిడిపికి మరో ట్విస్ట్ ఏంటంటే వైసీపీ నుంచి వచ్చిన వారికి ఒంగోలు, నరసరావుపేట, నెల్లూరు పార్లమెంటు స్థానాలను కట్టబెడుతున్న పరిస్థితి. ఇక జనసేన సైతం వైసీపీ నుంచి వచ్చిన బాలశౌరికి బందరు పార్లమెంటు సీటు ఇస్తుంది.