రాజకీయాల్లో సీనియర్లు ఉంటారు. జూనియర్లూ వస్తారు. ఎప్పటికప్పుడు కొత్త నీరు పారుతూనే ఉంటుంది. ఇది అవసరం కూడా. కానీ, కొన్ని కొన్ని సార్లు జూనియర్లు సక్సెస్ కాలేక పోవడం తెలిసిందే. ఎందుకంటే.. ప్రజల అభీష్టాలు అలా ఉంటాయి. ఉదాహరణకు తెలంగాణలో కేసీఆర్ను ముఖ్యమంత్రిగా అంగీకరిం చిన ప్రజలు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బీఆర్ ఎస్ గెలిస్తే.. కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేస్తారన్న వాదనతో ఎందుకో,.. కాంప్రమైజ్ అయ్యారు. పలితంగా బీఆర్ ఎస్ ఓటమి తప్పలేదు.
అంటే.. సీనియర్గా ఉన్న కేసీఆర్ను నమ్మినట్టుగా కేటీఆర్ను ముఖ్యమంత్రిగా ప్రజలు స్వీకరించలేక పోయారు. దీనికి కారణాలు ఏంటనేది చూడలేం. ఇప్పుడు ఏపీలోని విజయవాడ తూర్పు నియోజకవర్గం లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా టీడీపీ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉన్నారు. ఇక, వైసీపీ నుంచి యువ నాయకుడు.. వరుస పరాజయాలతో ఉన్న దేవినేని అవినాష్ ఉన్నారు.
వీరిద్దరూ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే.. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న కుటుంబాలే. కానీ, ప్రస్తుతం ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలు కావొచ్చు.. ముఖ్యంగా అభివృద్ధి చెందాల్సిన పరిస్థితిలో ఉన్న తూర్పు నియోజకవర్గం కారణం కావొచ్చు.. ఇక్కడి ప్రజలు అనుభవానికి పెద్ద పీట వేస్తున్నారు. అంటే.. సీనియర్ అయిన గద్దె రామ్మోహన్ వైపు మెజారిటీ ప్రజలు నిలుస్తున్నారనేది ఇక్కడ జరుగుతున్న చర్చ. ఆయనకు పార్టీలతో పనిలేకుండా ఉండడం గమనార్హం.
ఇక, అవినాష్ విషయానికి వస్తే..ఆ యన యువకుడు, ఉత్సాహవంతుడు. దేవినేని నెహ్రూ వారసుడు అనే కోణంలో ప్రజల్లో ఎప్పటికీ ఆదరణ ఉంది. కానీ.. ఇప్పటి వరకు చూసుకుంటే.. మాత్రం ఈసారికి.. సీనియ ర్ వైపే మొగ్గు చూపుతున్న పరిస్థితి స్పస్టంగా కనిపిస్తోంది. `అవినాష్కు మేం వ్యతిరేకం కాదు. కానీ, ఇప్పుడున్న పరిస్థితిలో సీనియర్ నాయకుడు కావాలని కోరుకుంటున్నాం` అని మెజారిటీ కమ్మ సామాజిక వర్గం కోరుకుంటున్న పరిస్థితి తూర్పులో కనిపిస్తోంది.
అవినాష్లో ఇంకా రాజకీయ పరిపక్వత రావాలని.. గద్దెతోనే తూర్పు నియోజకవర్గానికి వచ్చే 5 – 10 ఏళ్లలో భవిష్యత్తు కనపడుతోందని నమ్మేవారే ఎక్కువ మంది ఉన్నారు. ఈ సారి అవినాష్ ఎంత కష్టపడుతున్నా తూర్పు నియోజకవర్గ ప్రజలు మళ్లీ గద్దేనే కోరుకుంటోన్న వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది.