Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన తన అరెస్టును సవాల్ చేస్తూ గతంలోనే సుప్రీం కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
లోక్ సభ ఎన్నికల వేళ ఓ పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఒక వేళ బెయిల్ మంజూరు చేస్తే ముఖ్యమంత్రిగా అధికారిక బాధ్యతలు నిర్వర్తించొద్దని సూచించింది. ఇది అసాధారణ పరిస్థితి. అరవింద్ కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ఓ ముఖ్యమంత్రి. తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదు. లోక్ సభ ఎన్నికలు అయిదేళ్లకు ఒకసారి వస్తాయి. పార్టీ అధినేతగా ఆయన ప్ర్రచారం చేయాల్సిన అవసరం ఉంది అని వ్యాఖ్యానించింది.
అయితే సుప్రీం అభిప్రాయాలను ఈడీ వ్యతిరేకించింది. సీఎం అయినంత మాత్రాన ఈ కేసులో ప్రత్యేకంగా పరిగణించకూడదని, కేసుల్లో రాజకీయ నాయకులకు మినహాయింపులు ఉండకూడదని ఈడీ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఇప్పుడు బెయిల్ మంజూరు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. ఇక, ఈ కేసులో కేజ్రీవాల్ దర్యాప్తునకు సహకరించలేదని, తొమ్మిది సమన్లను పట్టించుకోలేదన్నారు. అందుకే అరెస్టు చేయాల్సి వచ్చిందని వివరించారు.
అనంతరం ధర్మాసనం స్పందిస్తూ .. ఒక వేళ ఈ కేసులో మీకు బెయిల్ మంజూరు చేస్తే అధికారిక విధులు నిర్వర్తించేందుకు మేం అనుమతించబోం అలా చేస్తే ప్రజా ప్రయోజనాలకు విరుద్దంగా ఉంటుంది. బెయిల్ పై విడుదలైతే ఫైళ్లపై సంతకాలు చేయొద్దు అని తెలిపింది. దీనిపై కేజ్రీవాల్ తరపు న్యాయవాది మాట్లాడుతూ .. సీఎం ఎలాంటి పత్రాలపై సంతకాలు చేయరని, అయితే ఆ కారణంతో లెఫ్టినెంట్ గవర్నర్ వాటిని తిరస్కరించకుండా చూడాలని కోరారు.
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం .. మధ్యంతర బెయిల్ పై తీర్పును రిజర్వు చేసింది. మరో వైపు ఈ కేసులో కేజ్రీవాల్ జ్యూడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మే 20వ తేదీ వరకూ పొడిగించింది.
Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో