ఏపీలో కొన్నాళ్లుగా కలకలం రేపుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. రాజకీయంగా పెనుదుమారం రేపుతు న్న విషయం తెలిసిందే. ఈ చట్టం ద్వారా ప్రజల ఆస్తులను, భూములను జగన్ దోచుకుంటారని.. ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోతుందని ప్రతి పక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక, ప్రధాన మీడియా కూడా ఇదే తరహా వివరణలతో కథనాలు వండి వారుస్తోంది.
దీంతో ఒకరకంగా.. ప్రజల్లో అత్యంత వేగంగా దీనిపై చర్చ జరుగుతోంది. నిజానికి ఈ విషయం తెరమీదికి రాకముందు వరకు కూడా.. వైసీపీ మేనిఫెస్టో.. టీడీపీకూటమి మేనిఫెస్టోలపై చర్చ సాగింది. కానీ, ఎప్పుడైతే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెరమీదికి వచ్చిందో.. అనేక విషయాలను ఇది డామినేట్ చేసే సింది. ప్రత్యేకంగా.. వైసీపీకి అప్పటి వరకు ఉన్న `హోప్స్`ను కూడా.. ఈ వాదన తెరమరుగు చేసిందనే చెప్పాలి.
ఇలాంటి సమయంలో ఎన్నో ఆత్మరక్షణలు చేపట్టింది. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలే.. దీనిని సమర్థించారంటూ.. వైసీపీ అనుకూల మీడియాలోనూ ప్రచారం చేశారు. ఇది నిజమే కావొచ్చు. కానీ, దీనికి మించిన బలమైన ఆరోపణలతో మాజీ ఐఏఎస్ ఒకరు మీడియా ముందుకు వచ్చారు. ఇది మరింతగా వైసీపీకి సెగ పెడుతోంది. `ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని` అంటూ.. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన సంచలన ట్వీట్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయ వివాదాన్ని మరింత రాజేసింది.
పీవీ రమేష్ కొన్నాళ్లుగా వైసీపీకి దూరంగా ఉన్నారు. గతంలో ఈయన సలహాదారుగా జగన్కు పనిచేశారు. అయితే.. కొన్ని కారణాలతో ఆయనను తప్పించారు. ఈ క్రమంలో అప్పటి నుంచి ఆయన వైసీపీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇక, తాజాగా ఆయన చెప్పిన వ్యవహారం మరింతగా వైసీపీకి ఇబ్బందిగా మారింది. ఇది సాధారణ, సామాన్య ప్రజల్లోకి వెళ్లేలా ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుంటే.. వెళ్లకుండా చూసేందుకు వైసీపీ నానా తంటాలు పడుతోంది. ఎలా చూసుకున్న ఈ వ్యవహారం.. ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తే.. అంటే ప్రతిపక్షాలు నమ్మితే వైసీపీకి డ్యామేజీకావడం తథ్యమే. అలా కాకుండా… ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం కనుక బూమరాంగ్ అయితే మాత్రం.. అది ప్రతిపక్షాలకే నష్టం చేకూర్చడం ఖాయమని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.