వైసీపీ అగ్ర నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోటరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పుంగనూరు సహా.. పీలేరు, పలమనేరు, తంబళ్ల వటి అనేక నియోజకవర్గాల్లో ఆయన చెప్పిందే వేదం.. ఆయన చేసిందే శాసనం అన్నట్టుగా సాగుతున్న పరిస్తితి కనిపిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి హవా అంతాఇంతా కాదు. ముఖ్యంగా ఎస్పీల నుంచి ఎస్సైల వరకు పోలీసులకు అనధికార `బాస్`గా కూడా పెద్దిరెడ్డి వ్యవహరిస్తున్నారు.
దీంతో పుంగనూరు వంటి చోట్ల ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో జరుగుతున్నదాడులు.. పెడుతున్న కేసులకు లెక్కే లేకుండా పోయింది. అంగళ్లు వంటి ఘటనలు టీడీపీ అధినేత చంద్రబాబు కు ఎదురైనా.. ఇతర ప్రతిపక్షాలపై జరుగుతున్న దాడులైనా.. లెక్కలకు మిక్కిలిగానే ఉన్నాయి. కానీ, ఆయా పార్టీలు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే.. భారత చైతన్య యువజన పార్టీని స్థాపించి.. అనతి కాలంలోనే ప్రజలు ముఖ్యంగా యాదవ సామాజిక వర్గంలో గుర్తింపు తెచ్చుకున్న బోడే రామచంద్ర యాదవ్.. తన పవర్ ఏంటో చూపించారు.
తన జోలికి వచ్చి.. తనపై నిర్బంధాలు విధించేలా చేసిన పెద్దరెడ్డి కోటరీని బోడే బదాబదలు చేశారు. పెద్దిరెడ్డి కోటరీని బద్దలు కొడతామని చెప్పిన నాయకులు ఉన్నారే తప్ప.. చేసిన నాయకులు లేరు. కానీ, బోడే అలా కాకుండా.. తన సత్తా ఏంటో చూపించారు. కేంద్రంలో తనకు ఉన్న పలుకుబడిని, సత్తాను ఆయన చూపించారు. బీసీలు, ఇక యాదవుల జోలికి వచ్చి.. వారిని వేధిస్తే.. ఏం జరుగుతుందో పెద్దిరెడ్డికి… చవి చూపించారు. ఏప్రిల్ 29న తన ప్రచార వాహనాన్ని తగుల బెట్టడం.. తనపైనా దాడికి ప్రయత్నించిన పెద్దిరెడ్డి ముఠా.. తిరిగి బోడేపైనే హత్యాయత్నం కేసులు పెట్టించింది.
అయితే.. వీటిని ప్రధాన సవాల్గా తీసుకున్న బోడే.. ఈ ఘటనలను ఢిల్లీ వరకు తీసుకువెళ్లడంలోనే కాదు.. చర్యలు తీసుకునేలా చేయడంలోనూ సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే డీఐజీ అమ్మిరెడ్డి, పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సీఐ రాఘవరెడ్డి, ఎస్సై మారుతిలపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇదీమీ చిన్న విషయం కాదు.. ఒక మంత్రి కోటరీలో అధికారం చలాయిస్తున్న వారిని గుండుగుత్తగా బదిలీ చేయించడం .. తక్కువ కూడా కాదు. సో.. మొత్తానికి పెద్దిరెడ్డి పొలిటికల్ లైఫ్ లో తొలిసారి…. బోడే ఆయనకు చుక్కలు చూపించడమే కాదు.. సత్తా కూడా చాటారనడంలో ఎలాంటి సందేహం లేదు.