JD Lakshminarayana: జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విశాఖ పోలీస్ కమిషనర్ ఎ రవిశంకర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని లక్ష్మీనారాయణ కోరారు.
సీబీఐ జాయింట్ డైరెక్టర్ పదవికి స్వచ్చంద పదవీ విరమణ చేసిన అనంతరం వీవీ లక్ష్మీనారాయణ 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. విశాఖ లోక్ సభ స్థానం నుండి జనసేన అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. అయితే రెండున్నర లక్షలకుపైగా ఓట్లు సాధించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆ తర్వాత జనసేన పార్టీ నుండి దూరంగా జరిగిన లక్ష్మీనారాయణ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఇటీవల జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు. లక్ష్మీనారాయణ పార్టీకి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల కామన్ సింబల్ గా టార్చిలైట్ గుర్తును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.
తన పార్టీ తరపున లక్ష్మీనారాయణ విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. విశాఖలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన ఆరోపణలు చేస్తూ సీపీకి ఫిర్యాదు అందజేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం