Lok sabha Elections 2024: లోక్సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. పలు చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది. ఓటింగ్ కోసం ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వేసవి కావడంతో తొలి రెండు గంటలలోనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలి వచ్చారు.
రెండో విడతలో దేశంలోని 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ స్థానాలకు ఓటింగ్ను నిర్వహించారు. వాస్తావానికి 89 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా 88 స్థానాల్లోనే పోలింగ్ జరిగింది. మధ్యప్రదేశ్లోని బేతుల్ స్థానం నుంచి బరిలోకి దిగిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి అశోక్ భలవి ఈ నెల 9న మృతి చెందారు. దీంతో అక్కడ జరగాల్సిన ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం మూడో దశకు (మే 7వ తేదీకి) వాయిదా వేసింది.
కేరళ, పశ్చిమ బెంగాల్ లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలలో లోపాలు, బోగస్ ఓట్లతో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. మరో వైపు ఉత్తరప్రదేశ్ లోని మథుర, రాజస్థాన్ లో బన్స్ వారా, మహారాష్ట్ర, త్రిపురలోని పర్భానిలలో పలు గ్రామాల్లో వివిధ కారణాలతో ఓటర్లు పోలింగ్ ను బహిష్కరించి నిరసన తెలిపారు.
రాష్ట్రాల వారీగా సాయంత్రం 5 గంటల వరకూ ఉన్న పోలింగ్ శాతం చూసుకుంటే.. అస్సొంలో 70.66 శాతం పోలింగ్ నమోదు కాగా, బీహార్ లో 53.03, చత్తీస్ గఢ్ 72.13, జమ్ముకశ్మీర్ 67.22, కర్ణాటక 63.97. మధ్యప్రదేశ్ 54.83, మహారాష్ట్ర 53.51, మణిపూర్ 76.06, రాజస్థాన్ 59.19, త్రిపుర 77.53, ఉత్తరప్రదేశ్ 52.74, పశ్చిమ బెంగాల్ 71.84 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది. మూడోదశ ఎన్నికలు 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 94 నియోజకవర్గాల్లో మే 7న జరగనున్నాయి. మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 41 మంది రోగులు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. వారు ఓటు వేసేందుకు ఆసుపత్రి యాజమాన్యం తో ప టు ప్రభుత్వ అధికార యంత్రాంగం సహకరించింది. అంబులెన్స్ సర్వీసులను అందుబాటులో ఉంచి గ్రీన్ కారిడార్లను ఏర్పాటు చేశారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి వైద్యుల అనుమతి పొందాకే రోగులను ఓటు వేయడానికి వెళ్లేందుకు పంపించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం