Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల తరుణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింగ్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయి జైల్ లో ఉండటంతో ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ ఆప్ ప్రచార సారథ్య బాధ్యతలు చేపట్టారు. శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరపున సునీతా కేజ్రీవాల్ లోక్సభ ఎన్నికల ప్రచారబరిలోకి దిగారు.
పార్టీ ఈస్ట్ ఢిల్లీ అభ్యర్థి కుల్దీప్ కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. ఇందులో భాగంగా రోడ్షో నిర్వహించారు. జ్యుడిషియల్ కస్టడీకి పంపిన ఢిల్లీ పుత్రుడు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను, ఆప్ అభ్యర్థులను ఆశీర్వదించాలని ప్రజలను ఆమె కోరారు. కల్యాణ్పురి బ్లాక్ 20 నుంచి సుమారు 1.5 కిలోమీటర్ల మేర ఈ రోడ్షో సాగింది. సుమారు అరగంట పాటు సాగిన ఈ యాత్రకు అయిదు చోట్ల ప్రజలు స్వాగతం పలికారు.
బీజేపీ ఆటలు ఇంకెంతమాత్రం సాగనీయరాదని సునీతా కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ, పంజాబ్ సహా దేశంలోని అన్ని చోట్ల కేజ్రీవాల్ అరెస్టుపై సామాన్య ప్రజానీకం నిరసనలు తెలుపుతోందని అన్నారు. ప్రధాన మంత్రి నియంతృత్వానికి, ప్రజాస్వామ్యంపై దాడులకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తవుతున్నాయన్నారు. కేజ్రీవాల్ అరెస్టుకు ఓటుతోనే సమాధానం చెబుతామని ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారని సునీతా కేజ్రీవాల్ అన్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్తో పొత్తులో భాగంగా ఆప్ ఈస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ, న్యూఢిల్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. ఈశాన్య ఢిల్లీ, వాయవ్య ఢిల్లీ, చాందినీ చౌక్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోంది. కేంద్రంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే పేదలకు ఉచిత కరెంట్, దేశంలోని ప్రతి గ్రామంలోనూ, పట్టణాల్లోనూ ఆరోగ్య, విద్యా వసతులు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఆప్ పేర్కొంది.