తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏడు నుంచి పది సీట్లు కచ్చితంగా గులాబీ పార్టీ గెలవాల్సి ఉంటుంది. అప్పుడే గులాబీ పార్టీ మనుగడ తెలంగాణలో ఉంటుంది. లేకపోతే ఉన్న ఎమ్మెల్యేలు కూడా జంప్ అయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత… మళ్లీ పుంజుకోవాలంటే పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలి గులాబీ పార్టీ.
దానికి తగ్గట్టుగానే ఇప్పుడు గులాబీ పార్టీ అడుగులు వేస్తోంది. గతంలో చేసిన తప్పిదాలను రిపీట్ కాకుండా… ఆచితూచి అడుగులు వేస్తోంది. వచ్చిన ప్రతి ఛాన్స్ ను సద్వినియోగం చేసుకుంటోంది గులాబీ పార్టీ. గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు జనాల మధ్యలోనే ఉంటున్నారు. ఎర్రటి ఎండల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు.
ఆనాటి తెలంగాణ ఉద్యమ కాలాన్ని మరోసారి గులాబీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే తాజాగా జనాల్లోకి మరింత వెళ్లేందుకు కేటీఆర్ కూడా కాంగ్రెస్ తరహాలోనే ఆరు గ్యారంటీలను ప్రకటించారు. టార్చ్ లైట్, కొవ్వత్తి, పవర్ బ్యాంక్, ఇన్వర్టర్లు, చార్జింగ్ బల్బులు, జనరేటర్లు అంటూ మాజీ మంత్రి కేటీఆర్ 6 గ్యారంటీలను ప్రకటించాడు. అదేంటి కేటీఆర్ గ్యారంటీలను ప్రకటించడం ఏంటి అని అనుకుంటున్నారా ? అవును కాంగ్రెస్ పార్టీని ఇరుక్కున్న పెట్టే ప్రయత్నంలో భాగంగా ఈ స్ట్రాటజీని మైంటైన్ చేశారు కేటీఆర్.
గతంలో సిలిండర్కు మొక్కి ఓటు వేయాలని ఒక కొత్త నినాదాన్ని కేటీఆర్.. బిజెపికి వ్యతిరేకంగా తీసుకువచ్చారు. ఆ సందర్భంగా కేటీఆర్ సక్సెస్ అయ్యారు. ఇక ఇప్పుడు ఈ ఆరు గ్యారెంటీ ల పేర్లు చెప్పి… కాంగ్రెస్కు కౌంటర్ ఇచ్చారు. వీటిని గుర్తు పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు కేటీఆర్. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడిపోయింది.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ… అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ బస్సు, అడపాదడపా ఫ్రీ కరెంటు తప్ప ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. ఫ్రీ బస్సుల్లో కూడా అవకతవకలు కనిపిస్తున్నాయి. సరైన బస్సు సౌకర్యాలు ఉండటం లేదు. మొత్తం మహిళలే కూర్చోవడం వల్ల పురుషులకు స్థానం లేకపోవడం, బస్సుల్లో మహిళలు కొట్టుకోవడం లాంటి సంఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం.
ఇలా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమవుతోంది. దీంతో జనాల్లో నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పై వ్యతిరేకత ప్రారంభమైంది. దానికి తోడు గులాబీ పార్టీ చాలా బలంగా ప్రతిపక్ష రోల్ నిర్వహిస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం కక్కలేక మింగలేక వ్యవహరిస్తోంది. అటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలందరూ తమకు ముఖ్యమంత్రి కావాలని మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరాకుల తయారైంది. ఈ తరుణంలో కేటీఆర్ కొత్తగా 6 గ్యారంటీలని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీన్ని కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.