AP High Court: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్ పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుండి 13వ తేదీ వరకూ లబ్దిదారులకు జమ చేయవద్దని ఏపీ సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది. మరో వైపు ఈ నెల 13న ఓటింగ్ ముగిసే వరకూ ఈ పథకాలకు సంబంధించి నిధులను జమ చేయవద్దంటూ ఈ నెల 9న ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను 10వ తేదీ తాత్కాలికంగా పక్కన పెట్టింది.
అయితే నిధుల పంపిణీకి ఏ విధంగానూ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయవద్దని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రవర్తనా నియమావళిని అతిక్రమించేలా వేడుకలు నిర్వహించవద్దని.. నేతల జోక్యం లేకుండా చూడాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు గురువారం రాత్రి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ప్రధాన వ్యాజ్యాలపై కౌంటర్ వేయాలని ప్రతివాదులను ఆదేశించారు. జూన్ 27కి వాయిదా వేశారు. ఈ ఉత్తర్వులతో సంక్షేమ పథకాల నిధుల విడుదల చేసేందుకు ప్రభుత్వానికి స్వల్ప ఊరట లభించినట్లు అయ్యింది.
ఈ నెల 13న పోలింగ్ ముగిసే వరకూ సంక్షేమ పథకాల నిదుల సొమ్ము రూ.14,165 కోట్ల పంపిణీని నిలిపివేస్తూ ఈసీ ఈ నెల 9వ తేదీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది.
ఈసీ తరపున న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. వివిధ పథకాల కింద లబ్దిదారులకు రూ.14,165 కోట్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరిందని చెప్పారు. ఎన్నికలకు ముందు అంత పెద్ద మొత్తంలో సొమ్మును జమ చేస్తే ఎన్నికల ప్రక్రియపై ప్రభావం పడుతుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల సమాన అవకాశాలు దెబ్బతినకుండా, లబ్దిదారులను దృష్టి లో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సొమ్మును జమ చేసే విషయంలో రెండు మూడు రోజులు వేచి చూస్తే వచ్చే నష్టమేమి లేదని అన్నారు. కరువు మండలాలు, బాధిత రైతులను ప్రభుత్వం ఆరు నెలల క్రితం గుర్తించిందని, ఇప్పటి వరకూ సొమ్ము జమ చేయకుండా పోలింగ్ తేదీకి రెండు మూడు రోజుల ముందు సొమ్ము జమ చేస్తే ఎన్నికలను ప్రభావితం చేసినట్లు అవుతుందని తెలిపారు.
ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయలేదని, లబ్దిదారులే పిటిషన్లు వేశారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి కొత్త పథకాలతో పాటు పాత అమలులో ఉన్న పథకాలకూ వర్తిస్తుందని అన్నారు. సొమ్ము జమ చేయడంలో అంత జాప్యం ఎందుకు జరిగిందో తెలియజేస్తూ ప్రభుత్వం సమర్పించిన వినతిలో పేర్కొన్న కారణాలు సహేతుకంగా లేవని ఈసీ తరపు న్యాయవాది పేర్కొన్నారు. పెట్టుబడి రాయితీ విషయంలో ఆరు నెలలు వేచి చూసిన వారు మరో మూడు, నాలుగు రోజులు వేచి చూడలేరా అని అన్నారు.
పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి, న్యాయవాది వీఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపించారు. నిధుల పంపిణీని నిలువరిస్తూ ఈసీ తీసుకున్న పథకాలు కొత్తవి కాదుని, ఎప్పటి నుంచో అమలు అవుతున్నవని వివరించారు. రాష్ట్రంలో కరువు మండలాలు గా ప్రకటించిన ప్రభుత్వం 6.95 లక్షల మంది రైతులకు ఇన్ పుట్ సబ్సిడీగా రూ.847 కోట్లు ఇవ్వాలని నిర్ణయించిందని, వాటిని నిలుపుదల చేయడం వల్ల రైతులపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ఇప్పటికే కొనసాగుతున్న పథకాల నిధుల పంపిణీని నిలువరించాల్సిన అవసర లేదని ఎన్నికల ప్రవర్తనా నియమావళి స్పష్టం చేస్తొందన్నారు. ఇందుకు భిన్నంగా ఈసీ వ్యవహరించిందన్నారు. అధికార పార్టీ దీనిని సొంత ప్రయోజనాల కోసం ప్రచారం చేసుకోకుండా ఈసీ షరతులు విధించవచ్చని అన్నారు.
విద్యాదీవెన పథకం నిధులను సకాలంలో జమ చేయకుంటే విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్ధులను ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉందన్నారు. ఎన్నికల మరుసటి రోజు నుండి సొమ్ము జమ చేసుకోవచ్చని ఈ నెల 9న ఈసీ తాజాగా ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసి నిదుల జమకు అనుమతి ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరాం వాదనలు వినిపిస్తూ ఇవేవీ కొత్త పథకాలు కావని అన్నారు. నిధుల లభ్యతను బట్టి సొమ్ము ను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. నిధుల పంపిణీకి అనుమతి కోరుతూ స్క్రీనింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనకు సకాలంలో నిర్ణయం వెల్లడించకుండా ఈసీ జాప్యం చేసిందన్నారు. నిధుల జమకు అనుమతివ్వాలని కోరారు. వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వు చేసి గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో శుక్రవారం (10 వ తేదీ) అర్ధరాత్రి వరకూ నిధులు లబ్దిదారుల ఖతాలో వేసేందుకు అనుమతి లభించినట్లు అయ్యింది.
కాగా, సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను నవతరం పార్టీకి చెందిన నేత డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. మరో పక్క ఏపీ ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ రాసింది. ఈ రోజు నగదు జమ చేయకపోతే ఏం అవుతుందని ఈసీ ప్రశ్నించింది. జనవరిలో పథకాలకు ఇప్పటి వరకూ నగదు జమ చేయని మీకు ఒకే సారి ఇంత నగదు ఎలా వచ్చిందని ప్రశ్నించింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలియజేయాలని ఈసీ కోరింది. మధ్యాహ్నం 3 గంటల లోపు సమాధానం ఇవ్వాలని ప్రభుత్వానికి ఈసీ ఆదేశించింది. దీంతో నిధుల పంపిణీ పై సందిగ్ధత కొనసాగుతోంది.
YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా