Vijayashanti – Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు విజయశాంతి. వరంగల్ లో జన్మించిన విజయశాంతి.. శ్రీదేవి, మాధవి, జయసుధ, జయప్రద తెలుగు తెరను ఏళ్తున్న రోజుల్లో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు. 15 ఏళ్ల వయసులో ముఖానికి రంగులు వేసుకొని నట ప్రస్థానాన్ని ప్రారంభించారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు అగ్రతారగా ఓ వెలుగు వెలిగారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 180 కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రేక్షకులకు గుండెల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.
లేడీ సూపర్ స్టార్ గానే కాకుండా విశ్వ నట భారతి గా, లేడీ అమితాబ్ గా గుర్తింపు పొందారు. అయితే 2003 తర్వాత విజయశాంతి సినిమాలు చేయడం పూర్తిగా తగ్గించేశారు. 2006 నుంచి సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో బిజీ అయ్యారు. దాదాపు దశాబ్దాన్నర తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రంతో విజయశాంతి రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. ఈ సినిమా కంటే ముందే విజయశాంతి ఇండస్ట్రీలో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలనుకున్నారు. అది కూడా తన డ్రీమ్ రోల్ తో. ఇంతకీ విజయశాంతి డ్రీమ్ మరేదో కాదు రుద్రమదేవి.
కాకతీయ రాజవంశానికి చెందిన ప్రముఖ పాలకులలో ఒకరైన రుద్రమదేవి జీవితం ఆధారంగా విజయశాంతి ఓ సినిమా చేయాలని భావించారు. కానీ అది కుదరలేదు. ఎందుకంటే ఆవిడ డ్రీమ్ రోల్ ను అనుష్క శెట్టి లాగేసుకుంది. పరోక్షంగా విజయశాంతికి అన్యాయం చేసింది. గతంలో రుద్రమదేవి సినిమా గురించి విజయశాంతి స్వయంగా బయటపెట్టారు. `నేను తెలంగాణ బిడ్డను. సినిమాల్లో నుంచి పాలిటిక్స్ లోకి వచ్చాను. తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నాను. ఆ టైమ్ లో రుద్రమదేవి మూవీతో మళ్లీ చిత్ర పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాను. తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన మహారాణి రుద్రమదేవి పాత్ర చేయడం నా డ్రీమ్.
ఆమె జీవిత కథతో రీ ఎంట్రీ ఇస్తే బావుంటుందని అనుకున్నాను. స్క్రిప్ట్ సహా అన్నింటినీ తయారు చేసుకుంటున్నాం. పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఏదేమైనా నా సొంత సినిమాగా తీయాలని అనుకున్నారు. ఈలోపు తెలంగాణ రావడంతో మళ్లీ కొంత కాలం సినిమా ఆలస్యమైంది. ఈలోపు ఆ సినిమాను మరొకరు తీసేశారు` అంటూ విజయశాంతి చెప్పుకొచ్చింది. అయితే విజయశాంతి చేయాలనుకున్న రుద్రమదేవి సినిమా అనుష్క శెట్టి చేసింది.
గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో టైటిల్ పాత్రను అనుష్క పోషించగా.. రానా దగ్గుబాటి, అల్లు అర్జున్, విక్రమజీత్ విర్క్, కృష్ణం రాజు, ప్రకాష్ రాజ్, నిత్యా మీనన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. 3D బయోగ్రాఫికల్ యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకున్న రుద్రమదేవి సినిమా 2015 లో భారీ అంచనాల నడుమ విడుదలైంది. కానీ ప్రేక్షకులను మెప్పు పొందడంలో ఈ సినిమా పూర్తిగా విఫలం అయింది. అయితే స్టార్ కాస్ట్ నటించడం వల్ల రుద్రమదేవి చిత్రం రూ. 80 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.