Samyuktha Menon: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి. కేరళలోని పాలక్కాడ్ లో సంయుక్త జన్మించింది. 2016లో పాప్ కార్న్ అనే మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. 2018లో వచ్చిన తీవండి మూవీతో గుర్తింపు సంపాదించుకుంది. తక్కువ సమయంలోనే మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. అత్యధిక పారితోషకం తీసుకునే నటీమణుల్లో ఒకరిగా పరిగణించబడింది.
అలాగే 2018లో కలరి మూవీతో తమిళంలోకి, 2022లో భీమ్లా నాయక్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. భీమ్లా నాయక్ సినిమాలో రానా భార్యగా కమలి పాత్రలో నటించి మెప్పించింది. అదే ఏడాది కళ్యాణ్ రామ్ కు జోడీగా బింబిసారాలో నటించి బిగ్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత తెలుగులో సంయుక్త మీనన్ నటించిన సార్, విరూపాక్ష, డెవిల్ చిత్రాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. దీంతో టాలీవుడ్ కి సంయుక్త మినన్ లక్కీ బ్యూటీగా మారిపోయింది.
ఈ నేపథ్యంలోనే తెలుగులో ఆమెకు వరస అవకాశాలు వస్తున్నాయి. కానీ సంయుక్త మాత్రం చాలా జాగ్రత్తగా కథలను ఎంపిక చేసుకుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ పై సంయుక్త మీనన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. తెలుగు చిత్రాల్లో నటించడం చాలా కష్టమంటూ వ్యాఖ్యలు చేసింది. సంయుక్త మాట్లాడుతూ.. `మలయాళంతో పోలిస్తే తెలుగు సినిమాల్లో నటించడం నాకు ఎంతో కష్టంగా అనిపిస్తుంది. భాష రాకపోవడం ఇందుకు ఒక కారణమైతే.. మేకప్ మరో కారణం. అవును మీరు విన్నది నిజమే. మలయాళ చిత్రాల్లో నటించేటప్పుడు మేకప్ వేసుకోవడం సులభంగా ఉంటుంది.
ఎందుకంటే అక్కడ చాలా లైట్ గా సహజంగా మేకప్ వేస్తారు. దానివల్ల యాక్టింగ్ చేసేటప్పుడు స్వేచ్ఛగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండదు. తెలుగు సినిమాల్లో నటించేటప్పుడు మేకప్ ఎక్కువ వేస్తారు. దాని వల్ల సెల్ఫీ కేర్ ఎంతో తీసుకోవాలి. స్క్రీన్ పై ఎలా కనిపిస్తామా అని ఎప్పుడూ చూసుకుంటూ ఉండాలి. షార్ట్ చేస్తున్నప్పుడు కూడా మేకప్ చెక్ చేసుకోవాలి. ఇది నాకెంతో అసౌకర్యంగా అనిపిస్తుంది. ఎక్కువ మేకప్ వల్ల ముఖంపై ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ బ్యూటీ కామెంట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
కాగా, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సంయుక్త మీనన్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో స్వయంభూ ఒకటి. కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్ కెరీర్ లో స్వయంభూ 20వ చిత్రం. భరత్ కృష్ణమాచార్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను భువన్, శ్రీకర్ కలిసి అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దశలో స్వయంభూ మూవీ 2024 ఎండింగ్ లో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ మూవీతో పాటు సంయుక్త మీనన్ మలయాళంలో మోహన్ లాల్ తో కలిసి రామ్ అనే చిత్రంలో యాక్ట్ చేస్తోంది.