ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. ఏపీలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు మే 13వ తేదీన జరగనున్నాయి. అంటే మరో నాలుగు రోజుల్లోనే ఈ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ప్రచారానికి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ తక్కువ సమయాన్ని అన్ని పార్టీలు వినియోగించుకొని ప్రచారాన్ని ముందుకు సాగిస్తున్నాయి.
తమ ప్రత్యార్థులకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా… అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని వెళ్తున్నాయి అన్ని పార్టీలు. ఇలాంటి నేపథ్యంలో సీఎం జగన్ బహిరంగ సభలో ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్షమయ్యారు. అదేంటి జూనియర్ ఎన్టీఆర్… జగన్ సభకు రావడమేంటని అనుకుంటున్నారా…? ఆ జగన్ సభకు జూనియర్ ఎన్టీఆర్ రాలేదు కానీ ఆయన అభిమానులు మాత్రం రచ్చ చేసేశారు. జూనియర్ ఎన్టీఆర్ మరియు జగన్మోహన్ రెడ్డి కలిసి ఉన్న ఫ్లెక్సీలను, బ్యానర్లను, కటౌట్లను ఏర్పాటు చేసి రచ్చ చేశారు.
ఆ ఫ్లెక్సీలతో సీఎం జగన్మోహన్ రెడ్డి కర్నూలు బహిరంగ సభకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చారు. తమ మద్దతు మొత్తం… జగన్మోహన్ రెడ్డికి అంటూ నినాదాలు చేశారు. దానికి తోడు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా… జగన్మోహన్ రెడ్డికే జై కొట్టారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఏపీ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ అయింది. అయితే తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారని… జూనియర్ ఎన్టీఆర్ను తొక్కేసే ప్రయత్నం చంద్రబాబు కుటుంబం చేస్తుందని… అంశాన్ని తెరపైకి తీసుకువచ్చేందుకు వైసిపి ఇలా చేస్తోందని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు.
మొన్నటికి మొన్న కొడాలి నాని కూడా జూనియర్ ఎన్టీఆర్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. చంద్రబాబు నాయుడును వచ్చే ఎన్నికల్లో ఓడిస్తే టిడిపి బాధ్యతలు జూనియర్ ఎన్టీఆర్కు అప్పగిస్తారని ఆయన సెంటిమెంట్ బ్లాక్ మెయిల్ చేశారు. ఇక ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వైసిపి కార్యకర్తలు…. రచ్చ చేస్తున్నారని తెలుగుదేశం నేతలు అంటున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రభావాన్ని తెలుగుదేశం పార్టీ నేతల కంటే.. వైసీపీ బాగా వాడుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఏపీలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క ఛాన్స్ ను వదులుకోవడం లేదు. అందులో భాగంగానే రాజకీయాలకు దూరంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ పేరును కూడా వైసిపి కచ్చితంగా వాడుకుంటుంది. దాన్నే ఇప్పుడు అమలు చేస్తున్నారు. వైసిపి…జూనియర్ ఎన్టీఆర్ను బాగానే వాడుకుంటుంటే… తెలుగుదేశం పార్టీ మాత్రం చడి చప్పుడు లేకుండా వ్యవహరిస్తోంది. ఇలాగే సైలెంట్ గా టిడిపి ఉంటే.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి ఫ్యాన్స్ కూడా జగన్కు జై కొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా కాస్త వాడుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.