ఎవరైనా వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం తప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హద్దులు.. పద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా.. అవతలి వ్యక్తులను మోసేస్తే.. నష్టంతోపాటు కష్టం కూడా వస్తుంది. ము ఖ్యంగా క్షేత్రస్థాయి నాయకులు ఎలా చేసినా.. పార్టీల్లో కీలక స్థానాల్లో వున్న వ్యక్తులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. లేక పోతే.. మొదటికే మోసం వస్తుంది. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. గడిచిన రెండు రోజులు ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించారు.
ఏపీ ప్రజలకు మోడీ చెప్పాలని అనుకున్నది చెప్పారు. ఇక, కూటమి పార్టీల పొత్తు ధర్మం కాబట్టి.. మోడీ అంతటి నాయకుడు వచ్చినప్పుడు ఆయనను మోసేయడం పరిపాటే. వీరుడు.. శూరుడు అనడం తప్పు కాదు. కానీ.. అంతకుమించి.. చేసిన వ్యాఖ్యలు.. గుడ్డిగా ఆయన మద్దతు కోసం వెంపర్లాడిన వ్యవహారం వంటివి ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఈ విషయంలో టీడీపీ యువ నాయకుడు.. నారా లోకేష్ హద్దులు మీరారనే వాదన వినిపిస్తోంది.
రాజకీయాల్లో తనకు ఆదర్శం మోడీ అని నారా లోకేష్ అన్నారు. అంతేకాదు..త ల్లిని ప్రేమించడంలోనూ.. దేశాన్ని ప్రేమించడంలోనూ.. ఆయనను చూసి తాను ఎంతో నేర్చుకున్నానని డబ్బా కొట్టారు. కానీ, ఇది టీడీపీకి రుచించే వ్యవహారం కాదు. ఎందుకంటే.. చంద్రబాబు ఒక ఐకాన్. ఆయనను చూసి చాలా మంది నేర్చుకుంటున్నారని.. రాజకీయ పాఠశాలను నడుపుతున్నామని చెబుతున్న నారా లోకేష్.. పొరుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను తయారు చేశామని చెబుతున్న నారా లోకేష్ .. ఇలా మోడీకి సాగిలపడడం రాజకీయంగా ఆయనకు మైనస్ అవుతుంది.
ఇక, పవన్ విషయానికి వస్తే.. ఆయన మరిన్ని బౌండరీలు దాటేశారు. మోడీని విశ్వగురువుగా కీర్తించారు. అంతేకాదు.. కేంద్రంలో 400 స్థానాలు తెచ్చుకునే క్రమంలో అసవరమైతే.. తాను ప్రాణ త్యాగం చేస్తానని చెప్పారు. మరి ఈ మాట ఎందుకు చెప్పారో అర్థం కాలేదు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రవేటు పరంగా కాపాడుకోవడం కోసం.. ఎక్కడా ఆయన ఈ మాట అనలేదు. రాజధాని అమరావతి కోసం కూడా.. ఆయన ఏమీ ఇలా వ్యాఖ్యానించలేదు. సో. ఇప్పుడు ఇలా చెప్పడం ఆయనకు ఢిల్లీలో కొంత ఇమేజ్ పెంచుతుందే తప్ప.. స్థానికంగా భారీ డ్యామేజీ జరుగుతున్న విసయాన్ని ఆయన మరిచిపోతున్నారు.