Ramayana: హిందువుల పవిత్ర గ్రంథమైన రామాయణాన్ని ఇప్పటికే ఎందరో దర్శకులు వెండితెరపై ఆవిష్కరించారు. ఈసారి నితేష్ తివారీ వంతు వచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నితేష్ తివారీ బాలీవుడ్ లో రామాయణ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో తారలు భాగం అవుతున్నారు. ఇటీవల యానమల్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్ హిట్ ను ఖాతాలో వేసుకున్న రణబీర్ కపూర్ రాముడిగా, టాలీవుడ్ న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. కన్నడ స్టార్ యశ్, అరుణ్ గోవిల్, లారా దత్తా, బాబీ డియోల్, విజయ్ సేతుపతి, సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.
బాలీవుడ్ రామాయణలో రావణాసురిడి పాత్రలో నటించడమే కాకుండా యశ్ మరో బాధ్యతను కూడా తీసుకున్నారు. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సహ నిర్మాతగా యశ్ వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. మొత్తం మూడు భాగాలుగా రామాయణ చిత్రాన్ని విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. అలాగే కొన్ని నెలల పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకొన్న ఈ సినిమా ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది.
ముంబైలో నితేష్ తివారీ షూటింగ్ ను ప్రారంభించారు. నటీనటుల లుక్స్ లీక్ అవ్వకూడదని సెట్స్లోకి సెల్ఫోన్లను నిషేధించారు. అయినప్పటికీ చిత్ర టీమ్ కు షాకులు తప్పడం లేదు. కొన్ని రోజుల క్రితం రామాయణం సెట్ నుండి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. వాటిల్లో అరుణ్ గోవిల్ దశరథ్ రాజుగా, లారా దత్తా కైకేయి గెటప్లో కనిపించారు. ఇక తాజాగా సీతారాముల గెటప్స్ లో ఉన్న సాయి పల్లవి, రణబీర్ కపూర్ ల లుక్స్ ఆన్ లైన్లో లీక్ అయ్యాయి. మెరూన్ కలర్ సాంప్రదాయ దుస్తుల్లో ఇద్దరూ మెరిసిపోయారు.
ముఖ్యంగా సాయి పల్లవి సీతగా యువరాణి లుక్లో ఎంతో న్యాచురల్ గా కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం రామాయణ నుండి లీకైన రణబీర్ కపూర్, సాయి పల్లవి లుక్స్ నెట్టింట ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఎటువంటి ప్రకటన లేకుండా గప్ చుప్ షూటింగ్ ప్రారంభించినప్పటికీ చిత్ర యూనిట్ కు లీకుల బెడద మాత్రం తప్పడం లేదు. కాగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న రామాయణ కోసం రణబీర్ కపూర్ మరియు సాయి పల్లవి భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నారు. గత చిత్రం యానిమల్ కోసం రూ. 30 కోట్ల రేంజ్ లో పారితోషికం అందుకున్న రణబీర్ కపూర్.. రామాయణ కోసం ఏకంగా రూ. 75 కోట్లు డియాండ్ చేశాడనే టాక్ ఉంది. మూడు భాగాలుగా సినిమా రాబోతున్న నేపథ్యంలో అతని మొత్తం రెమ్యునరేషన్ రూ. 225 కోట్లు అని ఇటీవల ప్రచారం జరిగింది. అలాగే సాయి పల్లవి రూ. 18 కోట్లు ఛార్జ్ చేస్తుండగా.. కన్నడ స్టార్ యశ్ రావణాసురుడు పాత్ర కోసం రూ. 80 కోట్లు రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి.