రాజకీయాలంటే రాజకీయాలే. చప్పగా చేస్తామంటే కుదరదు. ప్రత్యర్థి ఎత్తుగడలు.. లోతుపాతులు గుర్తిం చి ఇవతల పక్షం అడుగులు వేయాల్సి ఉంటుంది. అలా కాకపోతే.. మరోసారి చేతులు కాల్చుకున్నట్టే అవుతుంది. ఈ పరిస్థితి ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. చిత్తూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం నగరి నుంచి ఈ సారైనా విజయం దక్కించుకోవాలని మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుమారుడు.. భాను ప్రకాష్ నాయుడు ప్రయత్నిస్తున్నారు.
భాను 2014లో ఓడిపోయారు.. గత ఎన్నికల్లో ఓడిపోయారు. అంటే వరుస పరాజయాలు వచ్చాయి. మరి ఇప్పు డైనా గెలుపు గుర్రం ఎక్కి తీరాలనే కసి అయితే.. భాను ప్రకాష్ లో కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితిలోనూ గెలవాలని ఉంది. కానీ, ఆ మేరకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలనే వాదన టీడీపీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఎందుకంటే.. ప్రత్యర్తిగా ఉన్న వ్యక్తి.. మంత్రి, పైగా ఫైర్ బ్రాండ్ రోజా. వైసీపీ కేడర్ అండగా ఉంది. కొంత మేరకు విభేదాలు ఉన్నా.. ఆమె బలంగా బరిలో ఉన్నారు.
రోజాకు కలిసి వస్తున్న అంశం.. కుటుంబ రాజకీయం. భర్త నుంచి అన్నల వరకు అందరూ ఆమె గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక, తనతో విభేదిస్తున్న వారితోనూ రోజా ఇటీవల షెడ్యూల్ వచ్చిన తర్వాత.. కలుపుకొని పోయేందుకు ప్రయత్నిస్తున్నారు. డబ్బులకు కొదవ లేకుండా ఖర్చు పెడుతున్నారు. ఇక, వైసీపీలో ఉన్న విభేదాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా రోజా దూకుడుగా ఉన్నారు. పైగా నియోజకవర్గంలో 24 వేల ఓట్లు ఉన్న మొదలియార్ సామాజిక వర్గంతో పాటు ( ఆమె భర్త సెల్వమణిది ఇదే సామాజిక వర్గం) ఎస్సీ ఓటర్లు 50 వేలు ఉండడం.. వారిలో మెజార్టీ ఓటర్లు రోజాకే వేసే ఛాన్స్ ఉండడం కూడా ఆమెను తక్కువ అంచనా వేసేందుకు ఛాన్స్ లేదు.
ఈ దూకుడును తట్టుకుని నెగ్గేందుకు గాలి భాను ప్రకాష్ కూడా అంతకు మించిన రేంజ్లో కష్టపడాలి. ప్రస్తుతం బాగానే తిరుగుతున్నా.. క్షేత్రస్థాయిలో నాయకులను మరింత కలుపుకొని వెళ్లాలి. అవసరానికి తగిన విధంగా నిధులు ఖర్చు చేయాలి. తండ్రి వారసత్వాన్ని అందుకునేలా నాటి నేతలను కూడా కలుపుకొని పోవాలి. ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ వ్యవహారంలో వెనుకబడి ఉన్నారన్న విమర్శలను తగ్గించుకునేందుకు ఆదిశగా కూడా అడుగులు వేయాలి. అప్పుడే రోజా వంటి నాయకురాలిపై విజయందక్కించుకోవడం సులువవుతుందని పరిశీలకుల అంచనా.