YS Jagan: ఏపీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవేళ కూటమి మ్యానిఫెస్టోను విడుదల చేశారు. టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో లోని అంశాలు అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిలో అవి ఆచరణ సాధ్యమేనా అన్న అనుమానం చాలా మందిలో కలుగుతోంది. అచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం, ఆ తర్వాత ఎన్నికల మ్యానిఫెస్టోను బుట్టదాఖలు చేయడం చంద్రబాబుకు అలవాటేనని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో విమర్శిస్తూనే ఉన్నారు.
తాజాగా జగన్మోహనరెడ్డికి మరో అస్త్రం లభించినట్లు అయ్యింది. కూటమిలోని బీజేపీ హైకమాండ్ యే ఆ అస్త్రాన్ని జగన్ కు ఇచ్చినట్లు అయ్యింది. ఇంతకూ అదేమిటంటే.. అనేక రకాల హామీలతో ప్రజాగళం పేరుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి మ్యానిఫెస్టోను ఇవేళ విడుదల చేశారు. దానిపై మూడు పార్టీల ఎన్నికల గుర్తులు ఉన్నప్పటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. ప్రధాని మోడీ ఫోటో గానీ బీజేపీ నేతల ఫోటోలు గానీ ఆ మ్యానిఫెస్టోపై లేవు. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు మోడీ ఫోటో కూడా ముద్రించారు. కానీ ఇప్పటి మ్యానిఫెస్టోపై మోడీ ఫోటో, బీజేపీ నేతల ఫోటోలు లేకపోవడం, కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మ్యానిఫెస్టోను చేతిలో కూడా పట్టుకోకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
దీనిపై సీఎం వైఎస్ జగన్ కూడా స్పందించారు. అన్నమయ్య జిల్లా కదిరి నియోజకవర్గంలో ర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడుతూ.. మోడీ ఫోటోను మ్యానిఫెస్టోలో పెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదని అన్నారు. మూడు పార్టీలు కూటమిలో ఉన్నప్పటికీ మోడీ ఫోటో ఎందుకు లేదని జగన్ ప్రశ్నించారు. ఢిల్లీ నుండి ఆ పార్టీ పెద్దలు మ్యానిఫేస్టోలో ఫోటో పెట్టవద్దని ఫోన్ రాబట్టే మోడీ ఫోటో పెట్టలేదని అన్నారు. ముగ్గురు కూటమిలో ఉంటే ఇద్దరు ఫోటోలను మాత్రమే ఎందుకు పెట్టారో అందరూ అర్ధం చేసుకుంటారని ఆయన తెలిపారు.
చంద్రబాబు వాగ్దానాలను అమలు చేసే వ్యక్తి కాదని మోడీకి కూడా తెలిసిందని, అందుకే నాడు రాజధాని నిర్మాణం అంటూ హడావుడి చేసి తాత్కాలిక నిర్మాణాలు చేసి తన పేరు బద్నాం చేశాడని మోడీ భావించబట్టే మోడీ ఈ సారి మ్యానిఫెస్టోలో ఫోటో పెట్టకుండా అడ్డుకున్నారని జగన్ ఆరోపించారు. మ్యానిఫెస్టోను కూడా పక్కనే ఉన్న బీజేపీ నేత పట్టుకోలేదంటే కూటమిలో ఉన్న పార్టీలకే చంద్రబాబుపై నమ్మకం లేదని, ఇక జనాలకు ఎందుకు ఉండాలని జగన్ ప్రశ్నించారు.
AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ- జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల