Ileana D’Cruz: ఇలియానా డి’క్రూజ్.. ఈ గోవా బ్యూటీ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరోయిన్ల జాబితాలో ఇలియానా ఒకటి. వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన దేవదాసు సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన ఇలియానా.. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. అలాగే తనదైన అందం, అభినయంతో యువతరం గుండెల్లో గుబులు పుట్టింది. ఇలియానా రెండో చిత్రం పోకిరి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పోకిరి సక్సెస్ తో భారీ స్టార్డమ్ సంపాదించుకున్న ఇలియానా.. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ఓ వెలుగు వెలిగింది. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి టాప్ స్టార్స్ తో ఆడిపాడింది.
అడపా తడపా తమిళ్, కన్నడ చిత్రాల్లో కూడా నటించిన ఇలియానా.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పర్చుకుంది. అయితే టాలీవుడ్ లో 2012 వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపిన ఇలియానా.. ఆ తర్వాత అనూహ్యంగా తెలుగు తెరపై కనుమరుగైపోయింది. సౌత్ లోని ఇతర భాషల్లో సైతం ఆమె కనిపించలేదు. బాలీవుడ్ కే పరిమితం అయింది. దాదాపు ఐదేళ్లు గ్యాప్ అనంతరం ఇలియానా మళ్ళీ 2018లో అమర్ అక్బర్ ఆంటోనీ మూవీతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఇలియానా మళ్ళీ సౌత్ లో పని చేయలేదు.
అయితే సౌత్ లో తన కెరీర్ నాశనం అవ్వడం పై ఇలియానా స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె దక్షిణాదిలో అవకాశాలు రాకపోవడం పట్ల ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఇలియానా మాట్లాడుతూ.. `2012లో అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కిన బర్ఫీ మూవీలో ప్రధాన పాత్రను పోషించి బాలీవుడ్ లోకి అడుగు పెట్టాను. అప్పటికే నేను దక్షిణాదిలో చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. ఆ సమయంలో అనురాగ్ చెప్పిన బర్ఫీ స్టోరీ నాకెంతగానో నచ్చింది. నా పాత్రకు కూడా చక్కటి ప్రాధాన్యత ఉంది. అటువంటి పాత్రను వదులుకోవడం తెలివి తక్కువ పనిగా భావించాను.
అందుకే బర్ఫీ మూవీకి ఒకే చెప్పాను. నేను అనుకున్నట్లే బర్ఫీ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కానీ ఈ సినిమా విషయంతో నేను దక్షిణాదిని వదిలేసి బాలీవుడ్ కి వెళ్ళిపోతున్నానని అప్పట్లో ప్రచారం జరిగింది. దక్షిణాదిలో సినిమాలు చేయనని అంతా భావించారు. ఆ అపోహ వల్లే సౌత్ లో దర్శక నిర్మాతలు నాకు అవకాశాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదు. దాంతో ఇక్కడ నా కెరీర్ పతనం అయ్యింది` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఇలియానా కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా, చాలా రోజుల తర్వాత దో ఔర్ దో ప్యార్ అనే రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ తో ఇలియానా నార్త్ ప్రేక్షకులను పలకరించింది. ఇందులో విద్యాబాలన్, ప్రతీక్ గాంధీ, ఇలియానా డి’క్రూజ్ మరియు సెంధిల్ రామమూర్తి ప్రధాన పాత్రలను పోషించారు. ఏప్రిల్ 19న విడుదలైన దో ఔర్ దో ప్యార్ మూవీ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ మూవీ సక్సెస్ తో ఇలియానా మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లకు సంతకం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.