Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైల్ లో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. సోమవారం ఆయనను కలిసి (ములాఖత్) మాట్లాడేందుకు సీఎం సతీమణి సునీత అనుమతి కోరారు. అయితే ఇందుకు జైల్ అధికారులు అంగీకరించలేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆప్ నేత అతిశీ ములాఖత్ కు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సునీత అభ్యర్ధనను తిరస్కరించామని జైల్ అధికారులు చెప్పారని సదరు వర్గాలు పేర్కొన్నాయి.
ఢిల్లీ మంత్రి అతిశీ సోమవారం జైల్ లో సీఎం కేజ్రీవాల్ తో ములాఖత్ అవ్వనున్నారు. ఇక పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మంగళవారం తీహార్ జైల్ కు వెళ్లి కేజ్రీవాల్ ను కలవనున్నారు. దీంతో మంగళవారం తర్వాతనే సునీతను అనుమతించనున్నట్లు జైల్ అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే నిబంధనల ప్రకారం వారంలో రెండు సార్లు మాత్రమే ములాఖత్ కు అనుమతి ఉంది. దీంతో భర్తను చూసేందుకు సునీత కేజ్రీవాల్ కు వచ్చే వారమే అనుమతి లభించనుంది.
అయితే, జైల్ లో ఉన్న వ్యక్తితో ఒకే సారి ఇద్దరు వ్యక్తులు మాట్లాడే వీలుందని, అయినప్పటికీ తీహార్ జైల్ అధికారులు సునీతను అనుమతించడం లేదని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. రీసెంట్ గా .. భగవంత్ మాన్.. కేజ్రీవాల్ ను కలిసినప్పుడు ఆయన వెంట ఆప్ జనరల్ సెక్రటరీ సందీప్ పాథక్ ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఉద్దేశపూర్వకంగానే సునీతను జైల్ అధికారులు అనుమతించడం లేదని ఆప్ నేతలు అంటున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింగ్ కేజ్రీవాల్ ను మార్చి 21న ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కస్టడీ విచారణ అనంతరం ఏప్రిల్ 1 నుండి ఆయన తీహార్ జైల్ లోనే ఉన్నారు. లోక్ సభ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ పరిణామాలు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. భర్త అరెస్టు నేపథ్యంలో సునీత కేజ్రీవాల్ ప్రచారంలోకి దిగారు. ఢిల్లీలో ఎన్నికల ర్యాలీలో ఆమె పాల్గొంటున్నారు.
YS Sharmila: వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?