Video Morphing Case: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ (డీప్ షేక్) కేసులో ఢిల్లీ పోలీసులు దూకుడు పెంచారు. అమిత్ షా పేరిట వైరల్ అవుతున్న కొన్ని నకిలీ వీడియోలపై ఢిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు ఇవేళ (సోమవారం) హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (గాంధీ భవన్) కు చేరుకున్నారు. గాంధీ భవన్ లో సమన్లు జారీ చేశారు. మే 1వ తేదీన విచారణకు హజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. అయితే గాంధీ భవన్ కు చేరుకుని నోటీసులు జారీ చేయడంతో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది.
అయితే ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు ఖండించారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జి సతీష్ మన్నె తో పాటు మరో ముగ్గురు నవీన్, శివకుమార్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అస్లాం తస్మీన్ లకు సీఆర్పీసీ 91 కింద ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అమిత్ షా మార్ఫింగ్ వీడియోను సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ (ట్విట్టర్) లో పోస్టు చేశారని ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు. దీంతో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారన్న ప్రచారం జరుగుతోంది.
అమిత్ షా ఈ నెల 23న తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఆక్కడ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్దమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తాం అని వ్యాఖ్యానించారు. దీన్ని కొంత మంది వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని షా చెబుతున్నట్లుగా ఎడిట్ చేశారని బీజేపీ ఆరోపిస్తొంది.