BRS: లోక్ సభ ఎన్నికల వేళ పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ కు బైబై చెబుతుండటం ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తొంది. ఆ పార్టీకి కీలక నేతలు వరుసగా షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. తాజాగా నల్లగొండ జిల్లాకు చెందిన కీలక నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ లో పరిస్థితిపై ఆ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇటీవల సంచలన కామెంట్స్ చేశారు. ఇవేళ సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వెళ్లారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ స్వయంగా గుత్తా నివాసానికి వెళ్లి పార్టీలో చేరాలని ఆహ్వానించారు. దీంతో గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనను ముఖ్యమంత్రి నివాసంలో పార్టీలో చేర్చుకున్నారు. అమిత్ రెడ్డికి పీసీసీ అధినేత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గుత్తా అమిత్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ కు నల్లగొండ జిల్లాలో అదనపు బలం చేకూరినట్లు అయ్యింది. బీఆర్ఎస్ నుండి ఇంకా వలసలు కొనసాగుతూనే ఉన్నట్లుగా ఈ చేరికతో స్పష్టం అవుతోంది. లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రం పార్టీ మారడం లేదని తెలిపారు. ఆయన తనయుడు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఇటీవల పార్టీలో పరిస్థితిపై సంచలన కామెంట్స్ చేశారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు కష్టాల్లో ఉందని అన్నారు. పార్టీలో నిర్మాణ లోపం, అంతర్గత ప్రజాస్వామ్యం లోపించడమే ఇందుకు కారణంగా పేర్కొన్నారు. ఎమ్మెల్యే కేంద్రంగా రాజకీయాలు చేయడం వల్లే పార్టీ కష్టాల్లో పడిందని గుత్తా అభిప్రాయపడ్డారు.
తన కుమారుడు అమిత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇవ్వలేదు అన్నది అవాస్తమని అన్నారు. తన కుమారుడిని ఎంపీగా పోటీలో దింపాలని స్వయంగా కేసిఆర్ కోరారనీ, దానికి అమిత్ కూడా సిద్దమైయ్యారని తెలిపారు. అయితే జిల్లాలోని నాయకుల నుండి సహకారం అందలేదనీ, కొందరు నేతలు తామే పార్టీ మారుతున్నామని చెప్పారనీ, అందుకే అమిత్ పోటీ నుండి తప్పుకున్నారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసిఆర్ ను కలిసేందుకు ప్రయత్నించానని, ఆరు నెలలు ప్రయత్నించినా కలవడం సాధ్యం కాలేదని గుత్తా తెలిపారు. ఇప్పటికైనా పార్టీ నిర్మాణంలో నాయకత్వం పై దృష్టి సారించాలని గుత్తా సూచించారు. ఇలా గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే ఆయన కుమారుడు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం విశేషం.