BCY Party: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు దౌర్జన్యానికి దిగారు. భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత, పుంగనూరు అభ్యర్ధి రామచంద్ర యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుండగా దాడికి యత్నించారు. దీంతో సదుంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రామచంద్ర యాదవ్ ఈ రోజు సదుం మండలం ఎర్రాతివారిపల్లె కు వెళ్లారు.
ఇది మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామం. ఈ గ్రామంలో బీసీవై పార్టీ ప్రచారం నిర్వహించడంపై పెద్దిరెడ్డి వర్గీయులు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత రామచంద్ర యాదవ్ ఆ గ్రామంలో ప్రచారాన్ని ముగించుకుని వెనక్కి వచ్చేశారు. ఆ తర్వాత గ్రామంలో ప్రచారం చేస్తుండగా.. పెద్దిరెడ్డి వర్గీయులు రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నించారు. ఈ దాడి ఘటనలో బీసీవై పార్టీ వాహనాలను ధ్వంసం అయ్యాయి. పలువురు పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు.
రామచంద్ర యాదవ్ భద్రతా( సీఆర్పీఎఫ్) సిబ్బంది వాహనాన్ని సైతం ధ్వంసం చేశారు. రామచంద్ర యాదవ్ ప్రచార వాహనానికి నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని రామచంద్ర యాదవ్ ను సదుం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడికి భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు చేరుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై రామచంద్ర యాదవ్ ఉన్నతాధికారులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.
రెండు రోజుల క్రితం పుంగనూరు మండలంలోని మాగాండ్లపల్లెలోనూ బీసీవై పార్టీ ప్రచారం నిర్వహిస్తుండగా ఇదే రకమైన పరిస్థితి ఎదురైంది. కరపత్రాలను పంపిణీ చేస్తుండగా, వైసీపీ కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. దీంతో మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడులకు దిగారు. దాడిలో బీసీవై పార్టీకి చెందిన ఓ వాహనం అద్దాలు పగిలాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం