Amit Shah Video Morphing Case: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు వ్యవహారం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తొంది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 1వ తేదీన విచారణ హజరుకావాలని వీరికి జారీ చేసిన సమన్లలో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి తన న్యాయవాది ద్వారా ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తొంది.
తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో మార్ఫింగ్ వీడియోలు పోస్టు చేయలేదని రేవంత్ రెడ్డి తెలియజేశారు. మరో పక్క నోటీసులు అందుకున్న కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు నిన్న విచారణకు హజరు కాలేదు. సమయం కావాలని కోరినట్లుగా తెలుస్తొంది. ఈ క్రమంలో ఇవేళ టీపీసీసీ సోషల్ మీడియా ఇన్ చార్జి సతీష్ తో పాటు నవీన్, ఆస్మా తస్లీమాలను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామం ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ అరెస్టులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరో పక్క ఇదే అంశంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అమిత్ షా మార్ఫింగ్ వీడియోపై బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీసీ 469, 505(1) కింద కేసు నమోదు చేశారు. అమిత్ షా చేసిన ప్రసంగాన్ని కల్పితం చేసి మార్ఫింగ్ చేసి వీడియోను సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నారని ప్రేమేందర్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీపీసీసీ ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ లో కూడా వీడియోను పోస్టు చేశారని పేర్కొన్నారు.
అమిత్ షా వాస్తవానికి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి షరతులు లేకుండా ముస్లిం లకు కల్పించిన రిజర్వేషన్లు రద్దు చేస్తామని, వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందిస్తామని చెప్పారని, కానీ అమిత్ షా .. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పినట్లుగా మార్ఫింగ్ చేసిన వీడియోను ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇందుకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ పై కేసు నమోదు చేయాలని కోరారు.
AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత