Sai Pallavi: చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు నెగ్గుకొని రావాలి అంటే టాలెంట్ ఎంత ముఖ్యమో గ్లామర్ కూడా అంతే ముఖ్యం. ఇంకా చెప్పాలంటే కొందరు దర్శక నిర్మాతలు గ్లామర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే అందంగా కనిపించేందుకు హీరోయిన్లు ఎప్పుడూ తాపత్రయపడతారు. అందం కోసం సర్జరీలు చేయించుకున్న ముద్దుగుమ్మలు కూడా ఎంతో మంది ఉన్నారు. దివంగత నటి శ్రీదేవి నుంచి శృతిహాసన్ వరకు ఎందరో నటీమణులు సర్జరీ ద్వారా తమ రూపురేఖలు మార్చుకున్నారు. అయితే తాజాగా ఈ జాబితాలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కూడా చేరిందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇటీవల కాలంలో సాయి పల్లవి ఫేస్ లో కనిపిస్తున్న కొత్త మార్పే ఈ ప్రచారం తెరపైకి రావడానికి ప్రధాన కారణం. 2015లో విడుదలైన మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమమ్ మూవీతో హీరోయిన్ గా సాయి పల్లవి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఫస్ట్ మూవీతోనే యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లోకి ప్రవేశించి తనదైన నటన ప్రతిభతో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. గ్లామర్ షోకు తావు లేకుండా నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ కోట్లాది మంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది.
టాలీవుడ్ లో లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా సినిమాలు చేస్తూ అగ్ర హీరోయిన్ గా దూసుకుపోతోంది. అయితే కెరీర్ ఆరంభంలో సాయి పల్లవి ముఖంపై మొటిమలు చాలా ఎక్కువగా ఉండేవి. ప్రేమమ్తో సహా పలు చిత్రాల్లో మేకప్ లేకుండా సాయి పల్లవి మొటిమలతో న్యాచురల్ గా కనిపించింది. కానీ ప్రస్తుతం సాయి పల్లవిని గమనిస్తే ఆమె ఫేస్ పై ఎటువంటి మొటిమలు లేవు. క్లియర్ స్కిన్ తో ఆమె కనిపిస్తోంది. దీంతో మొటిమలను తగ్గించుకోవడానికి సాయి పల్లవి సర్జరీ చేయించుకుందంటూ గత కొంత కాలం నుంచి ప్రచారం జరుగుతుంది.
అయితే తాజాగా ఈ ప్రచారంపై సాయి పల్లవి స్పందించింది. మొటిమలు పోవడానికి ఏదైనా ట్రీట్మెంట్ లేదా సర్జరీ చేయించుకున్నారా అనే ప్రశ్న సాయి పల్లవికి ఎదురయింది. అందుకు ఆమె బదులిస్తూ.. టీనేజ్ అమ్మాయిలకు మొటిమలు రావడం అనేది సర్వసాధారణం. కొంత కాలానికి వాటంతటా అవే తగ్గిపోతాయి. మొటిమలు పోవడానికి తాను ఎలాంటి ట్రీట్మెంట్ గానీ సర్జరీ కానీ చేయించుకోలేదని సాయి పల్లవి తెలిపింది. ఇక లాంగ్ హెయిర్ సీక్రెట్ ఏంటని ప్రశ్నించగా… తాను ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకుంటానని మరియు అలోవెరా జెల్స్ వాడతానని సాయి పల్లవి తెలిపింది.
కాగా, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయ. వాటిలో తండేల్ ఒకటి. లవ్స్టోరీ తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రెండో సినిమా ఇది. చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే తమిళంలో శివ కార్తికేయన్ తో కలిసి రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో అమరన్ అనే సినిమా చేస్తోంది. వీటితో పాటు సాయి పల్లవి బాలీవుడ్ లో రామాయణ మరియు మరొక సినిమాకు కమిట్ అయింది.