AP DGP: ఏపీ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా నియమితులైయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డికి సమాచారం అందించింది. ఏపీ డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న కేవీ రాజేంద్ర నాథ్ రెడ్డి పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నూతన డీజీపీ నియామకం కొరకు ముగ్గురు పేర్లతో కూడిన ప్యానెల్ ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపింది. సీనియారిటీ ప్రాతిపదికన 1989 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు (ఆర్టీసీ ఎండీ), 1991 బ్యాచ్ కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్, 1992 బ్యాచ్ కు చెందిన హరీష్ కుమార్ గుప్తా పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది.
ఈ క్రమంలో హరీష్ కుమార్ గుప్తాను నూతన డీజీపీగా ఈసీ ఎంపిక చేసింది. హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకల్లా డీజీపీగా బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.