ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎటు నిలవాలి? ఎటు వైపు ఓటేయాలి? అంటే.. ఇతమిత్థంగా చెప్పలేని పరిస్థితివచ్చింది. ఎందుకంటే.. నన్ను నమ్మండి అని చంద్రబాబు చెబుతుంటే.. కాదు.. నన్నే నమ్మండి.. మీకు అదిచేశాను.. ఇది చేశాను.. అని జగన్ చెబుతున్నారు. దీంతో నమ్మకం ఇప్పుడు సెంటరాఫ్ ఎట్రాక్షన్గా మారింది. ఇదే సమయంలో జగన్ను మరోసారి నమ్మితే.. మీరు మోస పోతారంటూ… కూటమి పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇక, జగన్ మాత్రం ఊరుకుంటాడా? అసలు బాబును ఎందుకు నమ్మాలనే ప్రశ్నను ఆయన తెరమీదికి తెచ్చారు. ఇదొక సంక్లిష్టమైన అంశంగా ఇరు పార్టీలూ మార్చేశాయి. అంటే.. నిన్న మొన్నటి వరకు చేసు కున్న రాజకీయ విమర్శలు.. అభివృద్ధి కేంద్రంగా సాగిన ప్రస్థానాలు.. కొట్టుకుపోయి.. నమ్మకం అనే అంశంతో జనాల మెదళ్లను వాష్ చేసే బృహత్తర ప్రచారానికి ఇరు పార్టీలూ. . తెరదీశాయి. ఇప్పుడు తేల్చుకోవాల్సింది ప్రజలే అనేది ఇరు పార్టీలూ చెబుతున్న మాట.
వాస్తవానికి ఏ ఎన్నిక వచ్చినా.. ప్రజలే న్యాయ నిర్ణేతలు.. కాబట్టి వారు ఎలానూ తేల్చుకుంటారు. అయితే.. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే.. తమిళనాడులోనూ 1980-2000 వరకు దాదాపు 20 ఏళ్ల పాటు ఇలాంటి రాజకీయమే జరిగింది. అమ్మ(జయలలిత)ను నమ్మొద్దని.. కరుణానిధి(డీఎంకే) ప్రచారం చేస్తే.. అసలు కరుణ లేని వారిని నమ్ముతారా? అంటూ.. అమ్మ ఎదురు దాడి చేశారు. దీంతో ప్రజలు విడతల వారీ అధికారం కట్టబెట్టారు.
అంటే.. ఒక పార్టీకి ఒకసారి.. తర్వాత.. మరోపార్టీకి అధికారం ఇచ్చుకుంటూ పోయారు. ఈ పరిణామంతో .. తమిళనాడులో ఏ పార్టీ కూడా.. వరుస విజయాలు దక్కించుకున్న పరిస్థితి లేకుండా పోయింది. తర్వాత.. 2009లో జరిగిన ఎన్నికల్లో మాత్రం వరుసగా జయలలిత ను గెలిపించారు. ఇప్పుడు ఏపీలోనూ ఇలాంటి పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు. అంటే.. ఐదేళ్ల కోసారి అదికారం మార్చే సంప్రదాయం దిశగా ఏపీ అడుగులు వేస్తోందనే అంచనాలు పెరుగుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.