Lok Sabha Elections 2024: దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి కేంద్రంలో ఇండియా కూటమి ద్వారా అధికారంలోకి రావాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి సొంత అభ్యర్ధుల నుండి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
తాజాగా ఒడిశాలోని పూరి లోక్ సభ స్థానం నుండి బరిలో ఉన్న ఆ పార్టీ అభ్యర్ధి సుచరిత మొహంతీ పోటీ నుండి తప్పుకున్నారు. ఈ మేరకు ఆమె ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కు లేఖ రాశారు. అయితే ఆమె పోటీ నుండి తప్పుకోవడానికి చెప్పిన కారణం ఆ పార్టీకి షాకింగ్ కు గురి చేసింది. ఎన్నికల ప్రచారానికి అవసరమైన నిధులు పార్టీ నుండి అందడం లేదని, ఈ విషయాన్ని రాష్ట్ర ఏఐసీసీ ఇన్ చార్జి దృష్టికి తీసుకువెళితే సొంత నిధులు ఖర్చు చేయమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వేతనం మీద ఆధారపడి జీవించే సాధారణ జర్నలిస్ట్ నని తెలిపారు.
పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన తాను ఉన్న డబ్బంతా ఖర్చు చేశానని పేర్కొన్నారు. ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ ద్వారా ప్రజల నుండి విరాళాలు కోరినా ఫలితం రాలేదని ఇక ప్రచారం నిర్వహించేందుకు తన వద్ద నిధులు లేవని అన్నారు. పార్టీ సహాయం చేస్తే తప్ప ప్రచారం కొనసాగించలేని పరిస్థితుల్లో ఉన్నందున పోటీ నుండి తప్పుకుంటున్నట్లు తన లేఖలో పేర్కొన్నారు. అలాగే తన పార్లమెంట్ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లలో కొన్ని చోట్ల గెలిచే అభ్యర్ధులకు బదులుగా బలహీన అభ్యర్ధులకు టికెట్ కేటాయించారని ఇలాంటి పరిస్థితుల్లో తాను పోటీ నుండి విరమించుకోవాలని భావిస్తున్నానని లేఖలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ లో చర్చనీయాంశం అయ్యింది. కాగా, ఒడిశాలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆ రాష్ట్ర అసెంబ్లీకి సైతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఆరో విడత లో భాగంగా మే 25న పోలింగ్ జరగనుంది. నామినేషన్లకు సమర్పణకు మే 6వ తేదీ వరకు గడువు ఉండగా, సుచరిత ఇంకా నామినేషన్ దాఖలు చేయలేదు. ఈ తరుణంలో ఎంపీ అభ్యర్ధిని తనకు కేటాయించిన టికెట్ ను రిటర్న్ చేస్తున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. పూరి లోక్ సభ నియోజకవర్గం నుండి 1998 నుండి వరుసగా ఆరు సార్లు బీజూ జనతా దళ్ విజయం సాధిస్తొంది. ప్రస్తుతం పోటీ నుండి తప్పుకున్న సుచరిత మొహంతి 2014 ఎన్నికల్లో పోటీ చేసి బీజేడీ అభ్యర్ధి పినాకి మిశ్రా చేతిలో పరాజయం పాలైయ్యారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే గుజరాత్ లోని సూరత్ కాంగ్రెస్ అభ్యర్ధి నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడంతో అక్కడి బీజేపీ అభ్యర్ధి గెలుపు ఏకగ్రీవం అయ్యింది. ఈ వ్యవహారం మరువకముందే ఇటీవలే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్ధి చివరి నిమిషంలో తన నామినేషన్ విత్ డ్రా చేసుకుని బీజేపీ గూటికి చేరారు. దీంతో అక్కడ కాంగ్రెస్ పోటీ లోనే లేకుండా పోయింది. ఇప్పుడు తాజాగా పూరి అభ్యర్ధి పోటీ నుండి ఆర్ధిక కారణం చూపి తప్పుకోవడం జరిగింది.
BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా