అవును.. రాజకీయాల్లో అన్ని వేళలా పంతమే పనికిరాదు. ఒక్కొక్కసారి పట్టు విడుపులు కూడా ముఖ్యమే. ఈ విషయంలో నాయకులు, పార్టీలు కూడా.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాయి. ఎంతో పట్టుదలకు పోయిన నాయకులు కూడా.. పరిస్థితులకు అనుకూలంగా వ్యవహరించి దిగి వచ్చిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. విజయనగరం నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలే కారణం.
విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పూసపాటి అశోక్ గజపతి రాజు కుమార్తె అదితి గజపతి రాజు పోటీలో ఉన్నారు. అయితే.. ఆమె వైసీపీ కంటే కూడా.. అసలు సమస్య.. సొంత పార్టీ నాయకురాలు.. మీసాల గీత నుంచే ఎదురైంది. గతంలో విజయం దక్కించుకున్న గీత.. ప్రస్తుత ఎన్నికల్లోనూ టికెట్ ఆశించారు. కానీ, ఆమెకు దక్కలేదు. దీంతో రెబల్గా అయినా.. పోటీ చేస్తానని ముందుగానే ప్రకటించారు. దీంతో స్తానిక నాయకత్వం అలెర్టయింది.
పార్టీ అధినేత చంద్రబాబుకూడా.. ఆమెను బుజ్జగించాలని సూచించారు. దీంతో కిమిడి నాగార్జున వంటి వారు ఆమెను బుజ్జగించారు. పార్టీ అదికారంలోకివస్తే.. ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు చెప్పమన్నట్టు చెప్పుకొచ్చారు. కానీ.. ఆమె అంగీకరించలేదు. అశోక్ గజపతి రాజు తనకు ఫోన్ చేసినా.. స్వయంగా వచ్చినా.. వింటానని అన్నారు. దీంతో బాల్ అశోక్ గజపతి కోర్టులోకి వెళ్లింది. కానీ, గతంలో ఉన్న రాజకీయ విభేదాల కారణంగా.. ఆమెను బుజ్జగించేందుకు అశోక్ ముందుకు రాలేదు.
పైగా.. తన కుమార్తె మరోసారి ఓడిపోయినా తనకు ఇబ్బంది లేదని బాహాటంగా చెప్పారు. దీంతో మీసాల గీత ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు. అంతేకాదు.. తనకు ఎన్నికల గుర్తుగా.. గాజు గ్లాసును తీసుకు న్నారు. ఈ పరిణామం.. అదితి గజపతి రాజుకు తీవ్ర సంకటంగా మారిపోయింది. ఊరూ వాడా తిరుగుతూ.. తాను ఇక్కడే ఉంటానని.. అంకిత భావంతో పనిచేస్తానని చెబుతున్నా.. ఆమెకు గీత రూపంలో సుడిగుండం ఎదురుగా కనిపిస్తోంది.
దీనికి కారణం.. అశోకేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఒక్క మెట్టు దిగి వచ్చి.. ఆయన సహకరించి ఉంటే.. గీత పోటీ నుంచి తప్పుకొనే వారని.. అప్పుడుఅదితి విజయం ఖాయమయ్యేదని అంటున్నారు. కానీ, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి తగ్గిపోయిందని తమ్ముళ్లే చెబుతున్నారు.