Ram Pothineni: టాలీవుడ్ లో ఎనర్జిటిక్ స్టార్ గా, మోస్ట్ హాండ్సమ్ హీరోగా సత్తా చాటుతున్న రామ్ పోతినేని ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ మూవీ చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. అప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ తో ఉన్న రామ్ ఇస్మార్ట్ శంకర్ తో మాస్ హీరోగా అవతరించాడు. ఆ తర్వాత రెడ్, ది వారియర్, స్కంద వంటి మాస్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చేశాడు. అయితే ఈ చిత్రాలు భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా పట్టాయి. ప్రస్తుతం హిట్ కోసం తపిస్తున్న రామ్ ఆశలన్నీ డబుల్ ఇస్మార్ట్ పైనే ఉన్నాయి.
ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది .బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. పూరి కనక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మహాశివరాత్రి కానుకగా ఈ ఏడాది మార్చి 8న డబుల్ స్మార్ట్ సినిమా విడుదల కావాల్సి ఉంది.
కానీ షూటింగ్ పూర్తి కాకపోవడం వల్ల రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేశారు. ఇటీవల డబుల్ ఇస్మార్ట్ ఫైనల్ షెడ్యూల్ ప్రారంభమైంది. ప్రస్తుతం లీడ్ యాక్టర్స్ పై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తుది దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ సంగతి పక్కన పెడితే తాజాగా రామ్ పోతినేనికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. రామ్ కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. ఇప్పటివరకు బిగ్ స్క్రీన్ పై మాత్రమే అలరించిన రామ్ ను త్వరలో సరికొత్త ఫ్లాట్ ఫామ్ పై చూడబోతున్నాము.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామ్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడట. ఇటీవల కాలంలో ఓటీటీల హవా భారీగా పెరిగిపోతుంది. సినీ తారలు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇప్పటికే యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి, తమన్నా, కాజల్ అగర్వాల్ తో సహా ఎంతోమంది టాప్ స్టార్స్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ జాబితాలో రామ్ కూడా చేరబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
కొన్నాళ్లుగా ఫ్యాన్స్ రామ్ ను వెబ్ సిరీస్లలో లేదా ఏదైనా ఓటీటీ షో లో చూడాలని తెగ మచ్చట పడుతున్నారు. అయితే ఆ మచ్చటను రామ్ తీర్చేయబోతున్నాడు. ఈ మధ్య ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వరుసగా స్టార్ హీరోలతో వెబ్ సిరీస్ లను ప్లాన్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల నెట్ఫ్లిక్స్ ప్రతినిధులు రామ్ ను సంప్రదించగా.. స్టోరీ నచ్చితే వెబ్ సిరీస్ చేయడానికి తాను రెడీ అంటూ రామ్ వారికి హింట్ ఇచ్చాడట. దాంతో నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు ఇద్దరు ముగ్గురు దర్శకులను కథలతో రామ్ వద్దకు పంపించారట. ఇక స్టోరీ రామ్ కు నచ్చిందంటే ఆయన డిజిటల్ ఎంట్రీ కన్ఫార్మ్ అయినట్లే అని టాక్ నడుస్తోంది.