గుంటూరు జిల్లా చిలకలూరిపేట రాజకీయం మామూలుగా లేదు. అధికార వైసీపీ లో పేద్ద ముసలం మొదలు అయినట్టు గానే కనిపిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి విడదల రజనీ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయడం లేదు. ఆమెను జగన్ తొలి జాబితాలోనే గుంటూరు వెస్ట్ కు పంపేశారు. రజనీ కూడా ఇప్పటికే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడ ప్రచారం చేస్తూ దూసుకు పోతున్నారు. గత 2019 ఎన్నికలకు ముందు వరకు విడదల రజనీ టీడీపీ లో ఉండేవారు. ఆమె టీడీపీ చిలకలూరిపేట సీటు కోసం ప్రయత్నాలు చేశారు.
అయితే అక్కడ అప్పుడు మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావును తప్పించేందుకు ఇష్టపడని చంద్రబాబు ఆమెకు నరసారావుపేట ఎంపీ లేదా మరో సీటు ఇస్తాను.. లేదా ముందు ఎన్నికల కోసం పని చేయమని చెప్పారు. అయితే ఎన్నికలకు ముందే వైసీపీలోకి వెళ్లి అక్కడ సీనియర్ నేత, ప్రస్తుత ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ను కాదని మరీ సీటు తెచ్చుకున్నారు. గెలిచిన రెండున్నరేళ్ల తర్వాత ప్రక్షాళనలో ఆమె మంత్రి పదవి కూడా తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ తో పాటు వైసీపీ లో సజ్జల రామకృష్నా రెడ్డి లాంటి వాళ్లకు రజనీ బాగా అంటే బాగా దగ్గరయ్యారు.
కట్ చేస్తే ఈ సారి చిలకలూరిపేటలో రజనీ ఓడిపోవడం ఖాయమన్న నివేదికలు ముందే వైసీపీ కి వెళ్లి పోయాయి. దీంతో రజనీకి ఎలాగైనా ఫేవర్ చేయాలని ఉన్న వైసీపీ పెద్దలు ఆమెను గుంటూరు వెస్ట్ కు మార్చారు. ఆమె కూడా అక్కడ పని చేసుకుంటున్నారు. ఇక పేట వైసీపీ ఇన్చార్జ్ గా టీడీపీ నుంచే వైసీపీలోకి వచ్చిన మల్లేల రాజేష్ నాయుడుకు ఇచ్చేలా రజనీ చక్రం తిప్పారు. రాజేష్ పరిచయ సభలో రజనీ మాట్లాడుతూ పేట సీటును మా ఫాలోవర్, మా బంధువు అయిన రాజేష్ నాయుడుకు ఇప్పించుకున్నాను.. ఇక్కడ సీటు గెలిచే బాధ్యత ను కూడా సీఎం జగన్ నాకే అప్పగించారని మరీ వక్కాణించారు.
అయితే నెల రోజులకే పేట వైసీపీలో ముసలం మొదలైంది. రజనీకి, రాజేష్ నాయుడికి అస్సలు పడడం లేదు. ఇక సీటు కూడా రాజేష్ నాయుడికి రాదన్న ప్రచారం జరుగుతోంది. ఈ రోజు కార్యకర్తల సమావేశం పెట్టిన రాజేష్ మంత్రి రజనీపై తీవ్ర ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. తనకు సీటు ఇప్పించేందుకు రజనీ ఏకంగా రు 6.5 కోట్లు తీసుకుందని.. ఈ విషయాన్ని తాను సజ్జల రామకృష్నా రెడ్డికి చెపితే రు. 3 కోట్లు ఇచ్చి.. మిగిలిన సొమ్ము ఇవ్వకుండా మోసం చేశారని రాజేష్ నాయుడు ఆరోపించారు.
మర్రి రాజశేఖర్ కు సీటు ఇస్తే మరో రు. 20 కోట్లు అయినా తాను ఖర్చు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నానని… మరొకరికి సీటు ఇస్తే తాము ఊరుకోమని.. మంత్రి రజనీకి దమ్ము ఉంటే చిలకలూరిపేట లో పోటీ చేయాలని రాజేష్ సవాల్ విసిరారు. ఏదేమైనా చిలకలూరి పేటలో వైసీపీలో గొడవలు ముదురుతున్నాయి.