ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీలో చాలా మంది నేతలు గత రెండేళ్ల నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. మరీ ముఖ్యంగా టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేతలు అయితే రెండేళ్ల నుంచే పొత్తు కోసం వెంపర్లాటలు స్టార్ట్ చేసేశారు. ఇక ఎన్నికల మూడ్ రానే వచ్చేసింది. కొందరు నేతలు అసలు టీడీపీ తో పొత్తు లేకపోతే రాష్ట్రంలో ఒక్క సీటు కూడా పార్టీ గెలవడం కాదు కదా.. ఒక్క చోట కూడా డిపాజిట్ రాదని తేల్చిచెప్పారు. దీంతో చంద్రబాబు తో పొత్తు పెట్టు కోవడంలో బీజేపీలోనే జాతీయ నాయకత్వంలో చాలా మందికి నచ్చక పోయినా కనీసం పరువు దక్కుతుందన్న ఆలోచనతోనే ఒప్పుకుంది.
ఇక ఈ సారి ఎన్డీయేకు గత రెండు టర్మ్లలో వచ్చిన సీట్లు రావన్న సందేహాలు కూడా ఉన్నాయి. అందుకే పొత్తుకు వెళ్లింది. అయితే ఈ పొత్తు ఇప్పుడు కొందరు కీలక నేతలు.. ఇంకా చెప్పాలంటే బీజేపీలోనే సన్నిహితులుగా ఉన్న వారి మధ్య సైతం చిచ్చు పెట్టేస్తున్నాయి. పొత్తులో బీజేపీ కేవలం 6 పార్లమెంటు, 6 అసెంబ్లీ సీట్లు తీసుకుంది . తర్వాత అసెంబ్లీ సీట్ల సంఖ్య 10 కు పెరిగింది. అయితే బీజేపీ నుంచి పోటీ చేసేందుకు చాలా మంది సీనియర్ నేతలు.. పార్టీలో కీలక నేతలు.. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారు ఉన్నారు.
ఇక్కడ బీజేపీ తీసుకున్న సీట్లు లిమిటెడ్ గా ఉన్నాయి. కీలక నేతల్లో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి రాజమండ్రి సీటు, రఘురామకు నరసాపురం సీటు ఇస్తున్నారు. తిరుపతి సీటు రత్నప్రభకు, మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు అరకు సీటు ఇస్తున్నారని టాక్ ? ఇక విజయనగరం సీటు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కు అంటున్నారు. మరి సుజనా చౌదరి , సీ ఎం రమేస్ ఏమవుతారన్న సందేహాలు సహజంగానే ఉంటాయి.
సుజనా చౌదరి విజయవాడ లేదా ఏలూరు సీటు తీసుకోవాలని… చాలా మంత్రాంగం నడిపారు. ఇప్పుడు ఈ రెండు సీట్లు బీజేపీకి వచ్చేలా లేవు. పైగా కమ్మ కోటాలో పురందేశ్వరి ఉన్నారు. ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక సుజనా చౌదరి గత ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లారు. ఇప్పుడు సుజనా ను చాలా తెలివిగా సైడ్ చేసేసి సీఎం రమేష్ అనకాపల్లి సీటు దక్కించుకున్నారని తెలుస్తోంది. ఆయన వెలమ కమ్యూనిటి. రమేస్ ది కడప జిల్లాలోని ప్రొద్దుటూరు.
ఆయన సీమలో కాకుండా అనకాపల్లి ఎంచుకోవడానికి కారణం.. ఇక్కడ కొప్పుల వెలమ సామాజిక వర్గం ఎక్కువుగా ఉండడం. అనకాపల్లి నుంచి పోటీ చేసే విషయంలో జీవీఎల్ నరసింహా రావుకు సీఎం రమేష్ నుంచి గట్టి పోటీ ఏర్పడిందని.. చివరకు రమేష్ ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసుకుని అనకాపల్లి పార్లమెంటు సీటు దక్కేలా చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఎంపీ సీటు విషయంలో సుజనా ప్రయత్నాలు చెల్లకపోవడం.. అటు రమేష్ సీటు దక్కించుకోవడంతో ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యిందని అంటున్నారు.