PM Modi: ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారైంది. ఈ నెల 17న చిలకలూరిపేట లో జరిగే ఉమ్మడి బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు టీడీపీ – జనసేన – బీజేపీ ఏర్పాట్లు చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా బీజేపీ అగ్రనేతలు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తున్నారు.
దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ ఎన్డీఏలోకి టీడీపీ చేరడం, టీడీపీ – జనసేన – బీజేపీ ఉమ్మడిగా ఎన్నికల బరిలో నిలుస్తుండటంతో ఈ బహిరంగ సభకు ప్రధాని మోడీ హజరు కానున్నారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాని కార్యాలయం సమాచారం పంపింది. ఈ సభ ద్వారా ఒకే వేదికపైకి మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యామ్ రానున్నారు.
బీజేపీతో పొత్తు తర్వాత నిర్వహిస్తున్న తొలి ఎన్నికల బహిరంగ సభ కావడంతో మూడు పార్టీలూ దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నాయి. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ దీని బాధ్యత తీసుకుంది. పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. సభను విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన మూడు పార్టీల ముఖ్య నేతలతో 13 కమిటిలను ఏర్పాటు చేశారు.
కాగా, సభ ఏర్పాట్లపై నారా లోకేష్ నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమీక్షకు కమిటీ సభ్యులు హజరైయ్యారు. మరో పక్క మోడీ చేయబోయే ప్రసంగంపై సర్వత్రా ఆశక్తి నెలకొంది. గత ఎన్నికల సమయంలో పోలవరం ప్రాజెక్టును ఏటీఎంగా వాడుకున్నారంటూ విమర్శలు చేసిన ప్రధాని మోడీ.. మళ్లీ ఇప్పుడు ఎన్డీఏలోకి చేర్చుకున్న తర్వాత ఏ విధంగా మాట్లాడతారు అనేది చూడాలి. అదే మాదిరిగా ఇంత కాలం అనధికార మిత్ర పక్షంగా ఉన్న అధికార వైసీపీపై ఎలాంటి విమర్శలు చేస్తారు అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
YS Jagan: బెజవాడలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సీఎం వైఎస్ జగన్