Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అఖండ మూవీతో బిగ్ హిట్ కొట్టిన బాలకృష్ణ.. ఆ తర్వాత వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో సక్సెస్ జోరును కొనసాగిస్తున్నారు. చాలా కాలం తర్వాత హ్యాట్రిక్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్నారు. భగవంత్ కేసరి అనంతతరం బాలకృష్ణ తన 109వ చిత్రాన్ని కె. ఎస్. రవీంద్ర అలియాస్ బాబీ డైరెక్షన్ లో పట్టాలెక్కించారు. ఎన్బీకే 109 వర్కింగ్ టైటిల్ తో గత ఏడాదే వీరి కాంబో మూవీ ప్రారంభం అయింది.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తుండగా.. థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ సినిమా ఆల్రెడీ కొంత షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది. అయితే ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బాలకృష్ణ బాబీ మూవీ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నారు.
ప్రస్తుతం ఆయన ఏపీ ఎన్నికల హడావిడిలో ఉన్నారు. టీడీపీ తరఫున ముచ్చటగా మూడోసారి హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బాలకృష్ణ పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే హిందూపురం నియోజకవర్గంలో జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. బాలకృష్ణ షార్ట్ టెంపర్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన నోటికి, చేతికి కొంచెం దురుసు ఎక్కువ. కోపం వచ్చిందంటే ఎక్కడున్నానని కూడా పట్టించుకోరు. వెంటనే తన కోపాన్ని ప్రదర్శిస్తుంటారు.
అందుకే బాలకృష్ణతో మాట్లాడే వారు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. అలాంటి బాలకృష్ణను ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి బాలా అంటూ ముద్దు పేరుతో పిలుస్తారట. ఆ వ్యక్తి ఎవరో తెలుసా.. డాషింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఇండస్ట్రీలో బాలకృష్ణను బాలా అనే ముద్దుగా పిలిచే ఏకైక వ్యక్తి ఒక్క పూరి జగనాథ్ మాత్రమే అట. గతంలో ఆహా యొక్క సక్సెస్ ఫుల్ టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకేలో బాలకృష్ణ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టారు.
పూరి జగన్నాథ్ తన బెస్ట్ ఫ్రెండ్ అని.. ఇండస్ట్రీలో తనను బాలా పిలిచే ఒకే ఒక్క వ్యక్తి పూరి జగన్నాథే అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలు తాజాగా మరోసారి తెరపైకి వచ్చి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా, బాలకృష్న, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఏకైక చిత్రం పైసా వసూల్. ఈ యాక్షన్ కామెడీ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో శ్రియ శరణ్, ముస్కాన్ సేథి హీరోయిన్లుగా నటిస్తే.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. 2017లో భారీ అంచనాల నడుమ విడుదలైన పైసా వసూల్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ. 35 కోట్ల రేంజ్ లో వసూళ్లను సాధించింది. ఇక పైసా వసూల్ తర్వాత పూరీ, బాలయ్య కాంబో మళ్లీ సెట్ అవ్వలేదు.