Trisha: చెన్నై బ్యూటీ త్రిష కృష్ణన్ ను సౌత్ సినీ ప్రియలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాదాపు రెండున్నర దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో హీరోయిన్ గా సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా త్రిష గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1983 మే 4న చెన్నైలో కృష్ణన్, ఉమా దంపతులకు త్రిష జన్మించింది. లాయర్ కావాలన్నది త్రిష కల. హై స్కూల్ రోజుల్లోనే క్రిమినల్ సైకాలజీ చదవాలని త్రిష నిర్ణయించుకుంది. కానీ కాలేజీలో చేరాక త్రిష దృష్టి అనూహ్యంగా మోడలింగ్ వైపు మళ్లింది. చిన్న చిన్న ప్రకటనల్లో నటించింది. 1999లో మిస్ చెన్నై పోటీల్లో విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
అదే ఏడాది తమిళ చిత్రం జోడి మూవీ లో హీరోయిన్ సిమ్రాన్ కు స్నేహితురాలుగా నటించే అవకాశం త్రిషకు వచ్చింది. నిజానికి సినిమాల్లోకి వెళ్లాలని త్రిష ఎప్పుడు అనుకోలేదు. అయితే పాకెట్ మనీ కోసం జోడి మూవీ చేయాలని భావించింది. సినిమాల్లోకి వెళ్లడానికి తండ్రి త్రిషకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా తల్లి మాత్రం నో చెప్పారు. అయినా సరే త్రిష పట్టు వదల్లేదు. దాంతో త్రిష ఇష్టాన్ని తల్లి కాదనలేకపోయారు. అలా 1999లో జోడి మూవీ తో సినీ రంగ ప్రవేశం చేసిన త్రిష.. ఆ తర్వాత పూర్తిస్థాయి హీరోయిన్ గా నిలదొక్కుకుంది. జోడి అనంతరం తమిళ ఇండస్ట్రీలో వరుస చిత్రాల్లో నటించింది.
2003లో నీ మనసు నాకు తెలుసు మూవీ తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. 2004లో వర్షం మూవీతో బిగ్గెస్ట్ హిట్ ను ఖాతాలో వేసుకుని స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అదే ఏడాది తమిళంలో పోకిరి మూవీ రీమేక్ గిల్లి తో మరో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత త్రిష వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. టాప్ స్టార్స్ అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైతం అడపా తడపా సినిమాలు చేసింది. ఒక దశలో త్రిష కెరీర్ డౌన్ అయినా కూడా.. 2022లో వచ్చిన పొన్నియన్ సెల్వన్ మూవీతో ఆమె మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసింది.
హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ కెరీర్ ను పరుగులు పెట్టిస్తోంది. అగ్ర హీరోలతో జత కడుతూనే మరోవైపు లేడి ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా విశ్వంభర సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళ్, మలయాళం భాషల్లో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్లను లైన్ లో పెట్టింది. సినిమాల గురించి పక్కన పెడితే.. నాలుగు పదుల వయసు వచ్చినా కూడా త్రిష సింగిల్ లైఫ్ నే లీడ్ చేస్తోంది. గతంలో ఈ అమ్మడు చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది.
2015లో వైభవంగా వీరి నిశ్చితార్థం జరిగింది. కానీ పెళ్ళి వరకు వెళ్లకుండానే త్రిష, వరుణ్ విడిపోయారు. ఆ తర్వాత త్రిష మ్యారేజ్ లైఫ్ పై ఆసక్తి చూపులేదు. ఇక ఆస్తులు విషయానికి వస్తే.. ఇండస్ట్రీలో త్రిష హీరోలను మించి సంపాదించింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 10 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. త్రిష కు చెన్నైలో రూ. 15 కోట్లు విలువ చేసే విలాసవంతమైన ఇల్లు ఉంది. అలాగే హైదరాబాద్ లో కూడా ఆమెకు ప్రాపర్టీస్ ఉన్నాయి. పలు నివేదికల ప్రకారం త్రిష నికర విలువ రూ. 120 కోట్లు అని సమాచారం.