Pawan Kalyan: టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్ల నుంచి సినిమాలు, రాజకీయాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీలో ఎన్నికల హడావిడిలో ఉన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసి ఓటమిపాలైన పవన్ కళ్యాణ్.. ఈసారి పిఠాపురం సీటును ఎంచుకున్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. షూటింగ్స్ నుంచి విరామం తీసుకుని జోరుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈసారి కూడా పవన్ ను ఓడించాలని అధికార పార్టీ వైఎస్సార్సీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంటే.. పవన్ కళ్యాణ్ ను గెలిపించేందుకు జనసైనికులు, అభిమానులు హోరా హోరీగా పోటీ పడుతున్నారు.
ఇక ఇలాంటి తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇండియా టుడే రాజ్దీప్ సర్దేశాయ్తో ర్యాపిడ్ ఫైర్ సెషన్లో పాల్గొన్నారు. ఈ ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా పవన్ కళ్యాణ్ తనకు సంబంధించి కొన్ని సీక్రెట్స్ లీక్ చేశారు. తాను అమితాబ్ బచ్చన్కు పెద్ద అభిమాని అని పవన్ కళ్యాణ్ తెలిపారు. అలాగే `యే రాతేన్ యే మౌసం నది కా కినారా` అనే పాట తనకు ఎంతో ఇష్టమని పవన్ వెల్లడించారు. ఈ క్రమంలోనే రాత్రుళ్లు నిద్ర పట్టకపోతే తాను ఎలాంటి పనులు చేస్తానో కూడా వివరించారు.
రాత్రుల్లు నిద్ర పట్టకపోతే తనను తాను శాంతపరుచుకోవడం కోసం హర్రర్ సినిమాలు చూస్తానని.. అవి తన మనసుకు ప్రశాంతత కలిగిస్తాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అంతేకాకుండా బయట దెయ్యాలను ఎదుర్కోవడం కంటే స్క్రీన్పై దెయ్యాలను ఎదుర్కోవడమే తనకిష్టమని తెలిపాడు. ఇక హర్రర్ మూవీస్ చూడటంతో పాటు పవన్ కళ్యాణ్ నిద్ర పట్టకపోతే బుక్స్ కూడా చదువుతుంటాడట. స్వతాహాగా పుస్తాకల పురుగైన పవన్.. ఎంత ఒత్తిడిలో ఉన్నాసరే బుక్స్ చదవడం ద్వారా రిలాక్స్ అవుతాడట.
కాగా, సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది బ్రో మూవీలో చివరగా కనిపించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టారు. అందులో హరి హర వీరమల్లు ఒకటి. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం హరి హర వీర మల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ఐదు భాషల్లో 2024 చివరి నాటికి థియేటర్లలోకి రానుంది. ఇటీవల బయటకు వచ్చిన హరి హర వీరమల్లు టీజర్ ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ పీరియాడికల్ ఫిల్మ్ ను మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఎ. దయాకర్ రావు, ఏ.ఎమ్. రత్నం నిర్మిస్తున్నారు. బాబీ డియోల్, నిధి అగర్వాల్, నోరా ఫతేహి, విక్రమజీత్ విర్క్, నోరా ఫతేహి తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. అలాగే మరోవైపు సుజీత్ దర్శకత్వంలో ఓజీ, హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలను పవన్ కళ్యాణ్ పట్టాలెక్కించాడు. ఈ రెండు సినిమాలు సైతం నిర్మాణ దశలోనే ఉన్నాయి.