ఎన్టీఆర్ జిల్లాలోని కీలకమైన ఎస్సీ నియోజకవర్గం ఫైట్ ఈ సారి మామూలుగా ఉండదనే సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటివరకు టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు.. వైసీపీ కండువా కప్పుకోవడం, ఆయనను వెంటనే సమన్వయకర్తగా చేర్చడం తెలిసిందే. అయితే, నిన్న మొన్నటి వరకు పార్టీ ఎమ్మెల్యే గా ఉన్న రక్షణ నిధిని తొలగించడంతో ఆయన వర్గం కారాలు మిరియాలు నూరుతోంది. దీంతో ఆ వర్గం వైసీపీకి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది.
ఇక, టీడీపీ ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ప్రస్తుత ఇంచార్జ్గా ఉన్న శ్యావల దేవదత్ ను పక్కన పెట్టాలని నిర్ణయించింది. ఆయనకు పార్టీలోను, లేదా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. నామినే టెడ్ పోస్టు ఇచ్చి సంతృప్తి పరచాలని, నల్లగట్లపై ఆయన గెలుపు సాధ్యం కాకపోవచ్చని పార్టీ ఒక అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలోఫైర్ బ్రాండ్ ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన.. ఉన్నత విద్యావంతుడు.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొలికపూడి శ్రీనివాసరావుకు ఇక్కడ టికెట్ను దాదాపు కన్ఫర్మ్ చేసేశారు.
బలమైన సామాజిక వర్గంతోపాటు.. ఆయన సతీమణి కూడా.. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం తో ఉభయ కుశలోపరిగా ఉంటుందని టీడీపీ అంచనా వేసింది. పైగా మాటల మాంత్రికుడిగా ఆయన పేరుతెచ్చుకున్నారు. ఎన్నికల వేళ ఆయన ప్రచారం ప్రజలను ఆకట్టుకుంటుందని.. టీడీపీకి సాను కూలత పెరుగుతుందని, వైసీపీ అసమ్మతి దీనికి తోడైతే.. ఇక, కొలికపూడి విజయం రాసిపెట్టుకోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే.. విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని.. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి వైసీపీకి కొంత మేరకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు.. వరుస పరాజయాలతో ఉన్న నల్లగట్లకు సానుభూతి కూడా కలిసి రానుంది. ఈ విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన టీడీపీ కొలికపూడి వైపే మొగ్గు చూపింది. ఎలా చూసుకున్నా.. ఈ నియోజకవర్గంలో కొలికపూడి ఎంట్రీతో దంగల్ ఓ రేంజ్లోఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.