నూతన సంవత్సర వేళ దేశ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. కరోనా వ్యాక్సిన్ ఉచితంగానే అందించేందుకు చర్యలు చేపడుతున్నది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నేడు జరుగుతున్న వ్యాక్సిన్ డైరన్ ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా అడిగి ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీలోనే కాదు దేశమంతా ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదకగా కూడా తెలియజేశారు.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషద ప్రమాణాల నియంత్రణ సంస్థ నిపుణుల బృందం నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో కేంద్ర మంత్రి హర్షవర్థన్ నుండి ఈ ప్రకటన రావడం దేశ ప్రజలకు గుడ్ న్యూస్ అందినట్లు అయ్యింది. అదే విధంగా దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ పై అనేక వదంతులు వస్తున్నాయనీ, వాటిని నమ్మవద్దని కూడా హర్షవర్థన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ సామర్థ్యం, భద్రత, రోగ నిరోధకతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఆయన అన్నారు. దేశంలో పోలియో వ్యాక్సిన్ వేస్తున్న సమయంలోనూ ఇలానే అనేక వదంతులు వ్యాపించాయని గుర్తు చేశారు హర్ష వర్థన్. వాటిని పక్కన పెట్టి వ్యాక్సిన్ వేయడం వల్ల భారత్ పోలియోరహిత దేశంగా మారిందన్నారు.