CM YS Jagan: రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కారానికి మొబైల్ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. జగనన్న శాశ్వత భూహక్కు – భూ రక్ష పథకం పై సీఎం వైఎస్ జగన్ సంబందిత అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. ఈ పథకానికి సంబందించి అధికారులు సమగ్ర వివరాలను సీఎం జగన్ కు వివరించారు. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన డ్రోన్ ను సీఎం జగన్ పరిశీలించారు
CM YS Jagan: ఫిజికల్ రికార్డులు కూడా తయారు చేయాలి
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వెబ్ ల్యాండ్ లో గతంలో ఉన్న సమస్యలను అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే కాకుండా ఫిజికల్ రికార్డులు కూడా తయారు చేయాలని చెప్పారు. ఫిజికల్ డాక్యుమెంట్ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. సబ్ డివిజన్ కోసం అర్జీ పెట్టగానే సర్వే జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ సచివాలయ స్థాయిలోనే రిజిస్ట్రేషన్ లు జరగాలని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, రెవెన్యూ కమిషనర్ సిద్ధార్ద్ జైన్ తదితరులు పాల్గొన్నారు.
జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు భూములను కొలుస్తున్నారు. హద్దులు వేస్తున్నారు. పక్కాగా రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. కంప్యూటరీకరణ చేస్తూ ప్రతి భూమి పత్రాలకు ఓ సంఖ్యను కేటాయిస్తున్నారు. రికార్డుల్లో ఎక్కడా ట్యాంపరింగ్ కు అవకాశం లేకుండా సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగిస్తున్నారు. మూడు దశల్లో ఈ సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు.