AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు పడింది. డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డిని వెంటనే విధుల నుండి తప్పుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం. కూటమి నేతలు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఏపీ డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి విధుల్లో ఉంటే ఎన్నికలు సజావుగా జరగవని కూటమి నేతలు తరచూ ఎన్నికల కమిషన్ కు పిర్యాదులు చేస్తూ వచ్చారు. అలానే శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశం కూడా ఉందని తెలిపారు.
కాగా, ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ రాజేంద్రనాథ్ రెడ్డికి ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని ఈసీ స్పష్టం చేసింది. వెంటనే ఆయన కింది స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి రిలీవ్ కావాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సోమవారం ఉదయం 11 గంటల లోపు కొత్త డీజీపీని నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందు కోసం ముగ్గురు డీజీ ర్యాంక్ పేర్లను పంపించాలని ప్రభుత్వానికి సూచించింది.
ఎన్నికల షెడ్యుల్ విడుదల అయినప్పటి నుండి కూటమి నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూనే ఉన్నారు. కొద్ది రోజుల ముందే పలువురు కీలక అధికారులపై ఈసీ బదిలీ వేటు పడింది. సీఎస్, డీజీపీలను కూడా ఎన్నికల విధుల నుండి తప్పించాలని కూటమి నేతలు ఈసీకి వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఇవేళ డీజీపీపై బదిలీ వేటు వేసింది ఈసీ.