West Bengal Elections: బెంగాల్లో రాయల్ టైగర్ గర్జించింది…! ఒంటి కాలితో ప్రచారం నిర్వహించి… వీల్ చెయిర్ నుంచి మళ్లీ సీఎం చెయిర్లోకి మమత రాబోతున్నారు.. ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ బెంగాల్లో నూటికి నూరు శాతం వర్క్ అవుట్ అయ్యింది..ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయాన్ని ఎవరూ ఆపలేరని ప్రశాంత్ కిషోర్ బల్లగుద్ది చెప్పారు.అదే చివరకు నిజమైంది.
West Bengal Elections: సర్వశక్తులూ ఒడ్డిన కమలనాథులు!
బెంగాల్లో మమతా బెనర్జీ హ్యాట్రిక్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే మేజిక్ ఫిగర్ క్రాస్ చేసిన తృణమూల్ కాంగ్రెస్… డబుల్ సెంచరీని కూడా దాటేశారు. ఒక కాలుకి దెబ్బ తగిలితే ఏంటి.. ఒంటి కాలుతోనే బెంగాల్ను గెలుచుకుంటానని శపథం చేసిన కలకత్తా కాళి.. మమతా బెనర్జీ…అన్నట్టే…. తృణమూల్ హవాను కొనసాగించారు.
అయితే బీజేపీ కూడా బెంగాల్లో ఈసారి అనూహ్యంగా పుంజుకుంది. గత ఎన్నికల్లో కేవలం మూడంటే మూడు స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీ… ఇప్పుడు మమతకు వణుకు పుట్టించే స్థాయిలో పుంజుకుంది.ఒక దశలో అసలు బెంగాల్లో బీజేపీ గెలుస్తుందా అన్నంత హైప్ కూడా వచ్చింది.హోం మంత్రి అమిత్ షా పూర్తిగా బెంగాల్ మీదే దృష్టి కేంద్రీకరించారు.వీలైనంత మంది టీఎంసీ నేతలను కూడా బీజేపీ ఆకర్షించేసింది.ప్రచారానికి సినిమా గ్లామర్ ను కూడా జోడించింది.ప్రధాని నరేంద్రమోడీ విస్తృతంగా ప్రచారం సాగించారు.అయినప్పటికీ మమత హవా ఏమాత్రం తగ్గలేదని ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి.
కాంగ్రెస్, వామపక్షాలు ఖాళీ?
మరోవైపు ఒకప్పుడు బెంగాల్ను ఏకచత్రాధిపత్యంగా ఏలిన వామపక్షాలు.. ఇప్పుడు బెంగాల్ గడ్డపై నామరూపాలు లేకుండా పోయారు. గత ఎన్నికల్లో 76 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ లెఫ్ట్ కూటమి ఈసారి… అసలు ఖాతానే తెరవని పరిస్థితి కనిపిస్తుంది. దీనితో బెంగాల్ పీఠం మరోసారి దీదీకే దక్కనుంది. మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ హ్యాట్రిక్ విక్టరీ దిశగా సాగిపోయింది. పశ్చిమ బెంగాల్ లో అధికార టీఎంసీ వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టనుంది. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినా అందరి చూపు మాత్రం బెంగాల్ పైనే ఉంది. ఇక్కడ టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరి పోరు నడిచింది. ఈ పోరులో మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ఘన విజయం దిశగా దూసుకుపోయి౦ది.