Sai Pallavi: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి. హీరోయిన్లందరూ గ్లామర్ పుంతలు తొక్కుతుంటే ఒక్క సాయి పల్లవి మాత్రం తన రూటే సపరేటు అన్నట్టుగా ముందుకు సాగుతోంది. గ్లామర్ షో కి తావు లేకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. సౌత్ లో లేడీ పవర్ స్టార్ గా ఎదిగిన సాయి పల్లవి బర్త్ డే నేడు. ఈ సందర్భంగా సాయి పల్లవి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాయి పల్లవి 1992 మే 9న తమిళనాడులోని కోయంబత్తూరులో సెంథామరై కన్నన్ మరియు రాధ దంపతులకు జన్మించింది. సాయి పల్లవి పూజా కన్నన్ అనే చెల్లెలు ఉంది. 2016లో వైద్య విద్యను పూర్తి చేసిన సాయి పల్లవి.. బడగతో పాటు తమిళం, ఇంగ్లీష్, హిందీ, తెలుగు మరియు జార్జియన్ భాషలలో అనర్గళంగా మాట్లాడగలదు. చిన్నతనం నుంచి డ్యాన్స్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. పాఠశాలలో సాయి పల్లవి అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంది. డ్యాన్స్ పట్ల తనకున్న అభిరుచి కారణంగా 2008లో తల్లి మద్ధతుతో విజయ్ టీవీలో ఉంగలిల్ యార్ అడుత ప్రభుదేవా అనే డాన్స్ రియాలిటీ షోలో సాయి పల్లవి పాల్గొంది.
2009లో ఢీ అల్టిమేట్ డ్యాన్స్ షో (D4) లో పాల్గొని ఫైనలిస్ట్గా నిలిచింది. ఈ రియాలిటీ షోకి సంబంధించి ఓ క్లిప్పింగ్ చూసిన దర్శకుడు అల్ఫోన్స్ పుత్రెన్ తన సినిమాలో హీరోయిన్ గా నటించమని సాయి పల్లవిని సంప్రదించాడు. సాయి పల్లవికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా తల్లిదండ్రులు మాత్రం నో చెప్పాడు. సినిమాలు వద్దని ఆమెను జార్జియాలో మెడిసిన్ కి చేర్పించారు. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రెన్ సాయి పల్లవికి ఫోన్ చేసి ప్రేమమ్ మూవీలో మలార్ పాత్రను ఆఫర్ చేశారు. దాంతో సాయి పల్లవి అతికష్టం మీద పేరెంట్స్ ను ఒప్పించి ప్రేమమ్ కు సైన్ చేసింది. ఓవైపు చదువుకుంటూనే.. మరోవైపు సెలవుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేసింది.
2015లో విడుదలైన ప్రేమమ్ మూవీ మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు గానూ సాయి పల్లవి బెస్ట్ డెబ్యూ నటిగా అనేక అవార్డులు అందుకుంది. అయితే చాలా మంది సాయి పల్లవికి ప్రేమమ్ మొదటి చిత్రం అని అనుకుంటున్నారు. కానీ ప్రేమమ్ కంటే ముందే సాయి పల్లవి తమిళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కస్తూరి మాన్, ధామ్ ధూమ్ చిత్రాల్లో గుర్తింపు లేని పాత్రల్లో నటించింది. ఇక ప్రేమమ్ తర్వాత ఫిదాతో టాలీవుడ్ కు పరిచయమైన సాయి పల్లవి.. ఇక్కడ తొలి సినిమాతోనే భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఫిదా సూపర్ డూపర్ హిట్ కావడంతో సాయి పల్లవి వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. సహజ నటిగా గుర్తింపు పొందింది. హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ను ఏర్పర్చుకుంది.
అలాగే పరిశ్రమలో మేకప్ చేయకుండా సినిమాలు చేసే ఏకైక నటి సాయి పల్లవి. మేకప్ వేస్తే నువ్వు నీలా కనిపించడం లేదని దర్శకులు ఆమెతో చెప్పేవారట. అందుకే సాయి పల్లవి మేకప్ కు దూరంగా ఉంటుంది. ఆస్తుల విషయానికి వస్తే.. ఇండస్ట్రీలో సాయి పల్లవి భారీగానే సంపాదించుకుంది. పలు నివేదికల ప్రకారం.. సాయి పల్లవి నికర విలువ రూ. 48 కోట్లు అని తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం తెలుగులో తండేల్, తమిళంలో అమరన్, హిందీలో రామాయణం చిత్రాలు చేస్తోంది.