Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మే 9వ తేదీ అత్యంత ప్రత్యేకమైన రోజు. మే 9న సినిమాను విడుదల చేస్తే బొమ్మ బ్లాక్ బస్టరే. ఈ సెంటిమెంట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు చాలా ఏళ్ల నుంచి టాలీవుడ్ లో ఉంది. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, దివంగత నటి శ్రీదేవి జంటగా నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం 1990 మే 9న విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ కు ముందు రాష్ట్రాన్ని వరదలు అతలాకుతనం చేసేసాయి. కానీ ప్రకృతి సైతం ప్రేక్షకులను థియేటర్స్ కు రాకుండా ఆపలేకపోయింది. జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. కేవలం మౌత్ టాక్ తో వసూళ్ల వర్షం కురిపించింది. రూ. 2 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తే.. ఫుల్ రన్ లో ఏకంగా రూ. 15 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టింది.
ఆ తర్వాత 1997 మే 9న విక్టరీ వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాం రా సినిమా విడుదలైంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ స్టోరీ ఇది. సి. పరాన్జీ దర్శకత్వం వహించగా వెంకటేష్, అంజలా జవేరి జంటగా నటించారు. ప్రేమించుకుందాం రా సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. రూ. 20 కోట్ల రేంజ్ లో వసూళ్లను సొంతం చేసుకుంది. వెంకటేష్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
2002 మే 9న అక్కినేని మన్మధుడు నాగార్జున నటించిన సంతోషం సినిమా విడుదల అయింది. గ్రేసీ సింగ్, శ్రియా హీరోయిన్లుగా నటించారు. కొండపల్లి దశరథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను విశేషంగా కట్టుకుంది. మ్యూజికల్ గానూ ఈ మూవీ హిట్ అయింది. ఇప్పటికీ సంతోషం సినిమా వస్తుందంటే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుంటారు. అంతలా ఈ మూవీ ఆకట్టుకుంది.
2018లో ఇదే రోజున విడుదలైన మరొక చిత్రం మహానటి. సావిత్రి జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రను పోషించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన మహానటి చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మూడు జాతీయ అవార్డులను అందుకుంది. కీర్తి సురేష్ యాక్టింగ్, నాగ్ అశ్విన్ డైరెక్షన్ సినిమాను ఓ రేంజ్ లో లేపాయి. రూ. 25 కోట్ల బడ్జెట్ తో మహానటి సినిమాను నిర్మిస్తే.. ఫుల్ రన్ లో ఏకంగా రూ. 83 కోట్ల వసూళ్లు రాబట్టింది.
2019లో కూడా మే 9న ఒక సినిమా విడుదలైంది. అదే మహర్షి. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, బొట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటిస్తే.. అల్లరి నరేష్ కీలక పాత్రను పోషించాడు. ఇక ఈ సినిమా ఎలాంటి విజయాన్ని నమోదు చేసేందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రూ. 200 కోట్ల రేంజ్ లో వసూళ్లను అందుకున్న మహర్షి చిత్రానికి రెండు జాతీయ పురస్కారాలు సైతం వచ్చాయి. సో.. మే 9 టాలీవుడ్ కు ఎందుకంత స్పెషలో ఇప్పుడు అర్థమైంది కదా!!