CM Revanth Reddy: తెలంగాణ ఉద్యమ సమయంలో నళిని అనే మహిళా డీఎస్పీ తన పదవిని వదులుకుని వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె పేరు మరో సారి తెరపైకి వచ్చింది. ఉద్యమకారులకు, ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు తమ ప్రభుత్వంలో స్థానం ఉంటుందని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ డీఎస్పీ నళిని కోరుకుంటే ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే.
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆఫర్ ను ఆమె ఇప్పటికే తిరస్కరించారు. ప్రస్తుతం ఆమె అథ్యాత్మిక మార్గంలో ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగం చేయదల్చుకోలేదు. తనకు ఉద్యోగం లో ఆసక్తి లేదని స్పష్టం చేశారు. గత సమీక్షల్లో తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. ఈ నేపథ్యంలో అధికారులు సమాచారం ఇవ్వడంతో ఇవేళ నళిని మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ ను కలిశారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిని కలవడం సంతోషంగా ఉందన్నారు. ఉద్యోగం తనకు ఇప్పుడు అవసరం లేదని అన్నారు. డబ్బు, భౌతిక ప్రపంచం నుండి బయటపడ్డానని చెప్పారు. ఇప్పుడు తనది ఆధ్యాత్మిక మార్గమని అన్నారు. వేద కేంద్రాలకు ప్రభుత్వ సహకారం కోసం సీఎం రేవంత్ ను కోరగా, సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరలోనే వేదం, యజ్ఞం పుస్తకాలు పూర్తి చేస్తున్నానని చెప్పారు.
సనాతన ధర్మం ప్రచారం చేస్తానని తెలిపారు. సీఎం రేవంత్ కు గతంలో తాను, సహ ఉద్యోగులు డిపార్ట్ మెంట్ లో ఎదుర్కొన్న సమస్యలపై నివేదిక ఇచ్చానని, తనలా ఎవరు బాధపడకూడదన్న అభిప్రాయంతో ఆ సమస్యలను విన్నవించడం జరిగిందన్నారు. తన విషయంలో జరిగిన పరిణామాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. ఇన్నాళ్ల తన మనోవ్యధను గుర్తించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు నళిని.
నళిని భేటీ పై సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో తన డీఎస్పీ ఉద్యోగాన్ని త్యాగం చేసిన ఆడబిడ్డ నళిని ఈరోజు సచివాలయంలో నన్ను మర్యాదపూర్వకంగా కలిశారు అంటూ ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తెలంగాణ ఉద్యమ సందర్భంలో తన డీఎస్పీ ఉద్యోగాన్ని త్యాగం చేసిన ఆడబిడ్డ నళిని ఈరోజు సచివాలయంలో నన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.#TelanganaPrajaPrabhutwam pic.twitter.com/SV14o0slHc
— Revanth Reddy (@revanth_anumula) December 30, 2023