Kovvuru TDP: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీలో మరో సారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కేఎస్ జవహర్ తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కొవ్వూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీల్లో జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లుగా వ్యక్తుల పేర్లు కాకుండా గ్రామ టీడీపీ అని పేర్కొనడం వివాదాస్పదం అయ్యింది.
నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత పెండ్యాల అచ్చిబాబు స్వగ్రామమైన దొమ్మేరులో కూడా ఆయన (అచ్చిబాబు) ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై స్థానిక నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అచ్చిబాబు వర్గీయులు శుక్రవారం గ్రామంలో సమావేశమై జవహార్ పై బహిరంగ విమర్శలు చేశారు. గ్రామ నాయకులకు తెలియకుండా గ్రామంలో ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది జవహర్ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేసారు.
గ్రామ కమిటీని సంప్రదించకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అచ్చిబాబు చెప్పినట్లుగానే నడుచుకుంటామని స్పష్టం చేశారు. పలువురు సీనియర్ నేతలు సైతం జవహర్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పార్టీకి, ఫ్లెక్సీలకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటించారు. 2014 ఎన్నికల్లో అచ్చిబాబు చెబితేనే జవహర్ కు 13 రోజుల ముందు టికెట్ ఇచ్చినా ఎమ్మెల్యేగా గెలిపించామని చెబుతున్నారు.
దొమ్మేరులో జవహార్ కు మద్దతుదారులు లేరని అందుకే సొంతంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారని అంటున్నారు. అంతే కాకుండా శుక్రవారం కొవ్వూరులో జరిగిన జవహర్ పుట్టిన రోజు వేడుకల కూడా అచ్చిబాబు వర్గీయులు దూరంగా ఉన్నారు. రీసెంట్ గా అభ్యర్ధుల ఖరారులో భాగంగా పార్టీ హైకమాండ్ నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలోనూ జవహర్ పేరు ప్రస్తావించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజా వివాదానికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కొవ్వూరు నియోజకవర్గం రిజర్వుడు కాకముందు అచ్చిబాబు సోదరుడు పెండ్యాల వెంకట కృష్ణారావు అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అచ్చిబాబు, జవహర్ వర్గాల మధ్య ఏడు ఎనిమిది సంవత్సరాలుగా వివాదం నడుస్తొంది. దీంతో నియోజకవర్గంలో టీడీపీ రెండు వర్గాలుగా నడుస్తొంది. గత ఎన్నికలకు ముందు అచ్చిబాబు వర్గం వ్యతిరేకించడంతోనే జవహార్ ను పార్టీ అధిష్టానం తిరువూరు నియోజకవర్గానికి పంపింది. ఆయన అక్కడ ఓటమి చవి చూడటంతో మళ్లీ కొవ్వూరుపై దృష్టి పెట్టారు. జవహార్ కు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినప్పటికీ కొవ్వూరు నియోజకవర్గ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హైకమాండ్ సూచించిందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
మరో పక్క ఈ సారి కొవ్వూరు స్థానం నుండి జవహర్ పోటీ చేస్తారని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుండి పోటీ చేసిన వంగలపూడి అనిత వైసీపీ అభ్యర్ధి తానేటి వనిత చేతిలో పరాజయం పాలైయ్యారు. దాదాపు 25వేలకుపైగా ఓట్ల మెజార్టీతో వనిత గెలుపొందారు. టీడీపీ ఆవిర్భావం నుండి ఈ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా ఉండేది. 1999లో కాంగ్రెస్, 2019లో వైసీపీ అభ్యర్ధి గెలిచారు. 1983 నుండి 1994 వరకూ వరుసగా నాలుగు సార్లు, 2004 నుండి 2014 వరకూ వరుసగా మూడు సార్లు టీడీపీ ఆభ్యర్ధులే విజయం సాధించారు. ఈ నేపథ్యంలో గ్రూపు విభేదాలను పార్టీ అధిష్టానం ఏ విధంగా సరి చేసుకుంటుందో వేచి చూడాలి.