ఆహా… అసలు వీళ్లకు ఏమైనా ఉందా? ఉంటే దాన్ని వాడుతున్నారా…? ఇదీ సామాన్యుడి ప్రశ్న. సీఎం జగన్ నేతృత్వంలో ప్రభుత్వం కరోనా తగ్గించే ప్రయత్నాలు చేస్తుంటే… ఇటు క్షేత్రస్థాయిలో నాయకులు కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారు. ఎక్కడికక్కడ నాయకులు చిల్లర పబ్లిసిటీ వేషాలతో కొత్త చిక్కులు వస్తున్నాయి. మొన్న శ్రీకాళహస్తి, నిన్న రోజా, ఈరోజు కొండపిలో వెంకయ్య… అధికార పార్టీ అనే ధీమాతో విచ్చలవిడిగా ప్రజల్లో తిరుగుతూ, మెహర్బానీ కార్యక్రమాలు చేస్తూ ప్రాణాంతక వైరస్ విషయంలో అజాగ్రత్తగా ఉంటున్నారు.
: శ్రీకాళహస్తిలో 40 మందికి…
చిత్తూరు జిల్లాలో ఈ నెల 15 వరకు 8 కరోనా కేసులు ఉండేవి. ఒక్కసారిగా పెరుగుతున్నాయి. ఆకస్మికంగా ఆ జిల్లా భయనకస్థితికి వెళ్ళింది. దీనికి పరోక్ష కారణం ఈ జిల్లా శ్రీకాళహస్తి వైసిపి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ఈ నెల 12 న ఆ ఊరిలో ఒక పెద్ద ర్యాలీ నిర్వహించారు. జనాలను పోగేసి ఊరిలో ప్రధాన రహదారులు ద్వారా ర్యాలీ చేశారు. ఆ తర్వాత ఇక్కడ కరోనా కేసులు ఆకస్మికంగా విజృంభించాయి. అప్పటి వరకు రెండు మాత్రమే కరోనా కేసులు ఉండగా… ఈ నెల 16 న కొందరు అధికారులకు బయటపడింది. అలా అల్లా ఇప్పటికి 40 మందికి ఈ ప్రాణాంతక వైరస్ వ్యాపించింది. మొన్న ఓకేరోజున 24 మందికి, నిన్న ఆరుగురికి వచ్చింది. మరో 200 నమూనాలు పరీక్షలు చేసారు, ఫలితాలు రావాల్సి ఉంది. లాక్ డౌన్ ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి ఇలా చేశారు.
రోజమ్మకి పూల బాట…!
అదే జిల్లాలో నగరి ఎమ్మెల్యే రోజా కూడా తాజాగా విమర్శలపాలయ్యారు. ఈ నెల 20న ఆమె పుత్తూరు ప్రాంతంలో ఓ బోరు ప్రారంభానికి వెళ్లారు. ఆ గ్రామ నాయకులు మెహర్బానీ గా ఆమె నడుస్తున్న దారిలో పూలను వేయించారు. నిజానికి కరోనా వేళన జనాలను పోగేయ్యడమే తప్పు అనుకుంటే… జనాలతో ఇలా చేయించడం, పైగా ఫోటోలు తీయొద్దు అంటూ నాయకులు అంటుండడం.. వీడియోల్లో రికార్డ్ అయింది. ఈ వీడియో వైరల్ అయింది. తర్వాత రోజా ఎన్ని చెప్పుకున్నా, తప్పు జరిగిందనే భావన జనంలోకి వెళ్ళింది. ఆ ఊరిలో ఏ ఒక్కరికి కరోనా వచ్చినా ఇక ఆమెదే బాధ్యతగా ఉంటుంది.
వెంకయ్య… ఇదేమిటి..?
ఇది మరీ విడ్డురం. రద్దీగా ఉంటే కరోనా వ్యాపిస్తుంది అని చెప్పడానికి, రద్దీని క్రెయేట్ చేసి మరీ చెప్పారు. కరోనాపై అవగాహన అనే పేరుతో ప్రభుత్వ, పార్టీ భజన చేస్తూ పెద్ద సభ నిర్వహించారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవరర్గం కారుమంచిలో ఆ పార్టీ ఇంచార్జి వెంకయ్య ఆధ్వర్యంలో ఇది జరిగింది. మొన్న రాత్రి 200 మంది జనాలను పోగేసి, మీటింగ్ పెట్టారు. అరగంట స్పీచ్ ఇచ్చారు. వీరిలో ఏ ఒక్కరికి కరోనా సోకినా ఎవరిది బాధ్యత?? నిజానికి ఇది అసలు అవసరం లేని సభ. తన డాబు, భారీ తనం కోసం వెంకయ్య ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఈ మీటింగ్ వీడియో ఇప్పుడు రాష్ట్రమంతటా వైరల్ అయింది.
పోలీసు కోరలు లేనట్టేనా…??
ఒకరు, ఇద్దరు రోడ్డుపై కనిపిస్తే పోలీసులు లాఠీలకు పని చెప్తున్నారు. సామాన్యులను కొడుతున్నారు. కానీ ఈ పెద్దల పరిస్థితి ఏంటి? రోజా బొర్ ప్రారంభం, ఎమ్మెల్యే మధుసూదన్ ర్యాలీ, వెంకయ్య సభకి ఎవరు అనుమతి ఇచ్చారు? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు శ్రీకాళహస్తిలో ఆ ర్యాలీ కారణంగానే కరోనా సోకింది అంటూ పార్టీపై, ప్రభుత్వంపై నేరుగా విమర్శలు వస్తున్నాయి. దీనికి బాధ్యులు మొదట ఎమ్మెల్యే, తర్వాత పోలీసులే. మరోవైపు రోజా, ప్రకాశం జిల్లాలో వెంకయ్య చేసిన ఫలితాలు కూడా అలాగే వస్తే ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలిపోతాయి. అప్రమత్తంగాఉండాల్సిన సమయంలో ప్రచారానికి పోయి మచ్చలు చేసి వెళ్తున్నారు.