ఏపీలో తెలుగుదేశం – జనసేన పొత్తు ఖరారైంది. జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది.. ఏయే సీట్లు కోరుతుంది ? అన్నది ఒక్కటే క్లారిటీ రావాలి. చంద్రబాబు అరకు, మండపేట సీట్లలో టీడీపీ పోటీచేస్తుందన్న ప్రకటన చేసిన వెంటనే పవన్ కూడా ఆవేశంతో రాజోలు, రాజానగరం సీట్లలో జనసేన పోటీ చేస్తుందని కౌంటర్ ప్రకటన ఇచ్చారు. ఈ విషయంలో రెండు వైపులా నుంచి సమన్వయం ఉండాలి.
ఈ ప్రకటనలు ఎలా ఉన్నా పొత్తులో భాగంగా పవన్ అయితే ఖచ్చితంగా గెలిచే సీట్లే తీసుకోవాలి.. లేకపోతే ఖచ్చితంగా ఓడిపోయే సీట్లే తీసుకోవాలే తప్పా.. అటూ ఇటూ కాకుండా ఉన్న సీట్లు తీసుకుంటే టీడీపీ, జనసేన రెండికి చెడ్డ రేవడిలా మారి ఆ సీట్లలో వైసీపీ గెలిచే ప్రమాదం ఉంది.
ఉదాహరణకు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో చూస్తే గతంలో ప్రజారాజ్యం గెలిచిన సీట్లు, ప్రజారాజ్యం రెండో స్థానంలో ఉన్న సీట్లు, 2019 ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక సీటు రాజోలు లేదా ఆ పార్టీ రెండో స్థానంలో ఉండడం, లేదా 40 వేల పైచిలుకు ఓట్లు సాధించిన సీట్లు తీసుకుంటేనే రెండు పార్టీలకు ఉపయోగం ఉండేలా కనిపిస్తోంది. జనసేనకు కనీసం 20 వేల ఓట్లు కూడా రాని సీట్లు ఇప్పుడు కావాలంటే పొత్తు చాలా చోట్ల వర్కవుట్ అయ్యేలా లేదు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో జనసేన నరసాపురం, భీమవరంలో రెండో ప్లేస్లో ఉంది. అలాంటి సీట్లు ఆ పార్టీ ఆశించడంలో తప్పులేదు.
అలాగే గతంలో తాడేపల్లిగూడెంలో ప్రజారాజ్యం విన్ అయ్యింది. ఈ సీటును ఆశించొచ్చు. కానీ పార్టీకి కనీసం 20 వేల ఓట్లు కూడా రాని ఏలూరు, ఉంగుటూరు లాంటి సీట్లు ఆశించడం జనసేన అత్యాశే అనుకోవాలి. పార్టీ రెండో ప్లేస్లో ఉన్న సీట్లలో ఇప్పుడు పొత్తులో భాగంగా పోటీ చేస్తే టీడీపీ ఓట్లు సులువుగా ట్రాన్స్ఫర్ అయ్యి ఈజీగా జనసేన విన్ అవుతుంది. అలా కాకుండా పార్టీకి 15 వేల ఓట్లు వచ్చిన చోట కూడా జనసేన పోటీ చేస్తే ఆ పొత్తు ఒకటి రెండు చోట్ల సక్సెస్ అయినా చాలా నియోజకవర్గాల్లో చిత్తయ్యేలా ఉంది.
గోదావరి జిల్లాల్లో గ్రౌండ్ లెవల్లో వాతావరణం చూస్తుంటే పైన చెప్పుకున్నట్టుగానే ఉంది. ఉదాహరణకు రాజమండ్రి రూరల్లో గత ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. అయినా కూడా ఇక్కడ జనసేనకు 45 వేల ఓట్లు వచ్చాయి. ఇలాంటి చోట జనసేన సీటు ఆశించడంలో తప్పులేదు. కానీ జనసేన అధిష్టానం కావచ్చు, ఆ పార్టీ స్థానిక నాయకులు ఉంగుటూరు, ఏలూరు, తణుకు లాంటి సీట్లు కూడా తమకే అని చెప్పుకుని ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉంది. టీడీపీ నుంచి ఉంగుటూరులో ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, తణుకులో గత ఎన్నికల్లో వెయ్యి ఓట్లతో ఓడిన ఆరిమిల్లి రాధాకృష్ణ, ఏలూరులో చక్కటి సమన్వయంతో దూసుకు వెళుతోన్న బడేటి రాధాకృష్ణ పొత్తులో పోటీ చేస్తే గన్షాట్గా గెలుస్తారు.
అలాగే నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెంలో జనసేన క్యాండెట్లు పోటీలో ఉంటే సులువుగా విజయం సాధిస్తారు. ఎక్కడ ఎవరి బలం ఎంత… ఎక్కడ ఎవరు ? ఎవరికి ప్లస్ అవుతారు లాంటి అంచనాలు, ఆలోచనలు లేకుండా జనసేన సీట్లు కోరితే తాను ఇబ్బంది పడడంతో పాటు సులువుగా గెలిచే సీట్లను కూడా బంగారు పల్లెంలో పెట్టి వైసీపీకి అప్పగించినట్లవుతుంది. ఈ విషయంలో పవన్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.