పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కీలకమైన నియోజకవర్గం బాపట్ల పార్లమెంటు. ఇది ఎస్సీరిజర్వ్డ్ స్థానం. గత ఎన్నికల్లో వైసీపీ దక్కించుకుంది. పైగా..ఇక్కడ నుంచి గెలిచిన నందిగం సురేష్.. తరచుగా టీడీపీపైనా.. చంద్రబాబు, పార్టీ నాయకులపైనా తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో నందిగంను ఎట్టి పరిస్థితిలోనూ ఓడించాలనేది టీడీపీ వ్యూహం. అయితే.. ఆయనకు ఈ దఫా వైసీపీ టికెట్ ఇస్తుందా? లేదా? అనేది ఇంకా తేలలేదు. ఒకవేళ నందిగం సురేష్కే టికెట్ ఇస్తే.. ఆయనను ఢీకొట్టేలా సరైన నాయకుడిని బరిలోకి దింపాలని టీడీపీ భావిస్తోంది.
ఇదిలావుంటే.. బాపట్ల నుంచి పోటీ చేసేందుకు టీడీపీలో భారీ సంఖ్యలో నాయకులు రెడీగా ఉన్నారు. వీరిలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ముందు వరుసలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈమె తిరుపతి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2021లో జరిగిన.. ఉప ఎన్నికలోనూ టీడీపీ అభ్యర్థిగా తిరుపతి నుంచి పోటీ చేసి పరాజయం పొందారు. ఈ నేపథ్యంలో తనకు ఈ సారి బాపట్ల ఇవ్వాలని పార్టీని కోరుతున్నారు. ఇక్కడ గెలిచి చూపిస్తానని అంటున్నారు. ఆమె 2009 ఎన్నికల్లో ఇక్కడ నుంచే కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.
ఇక, అనంతపురం జిల్లా శింగనమలకు చెందిన ఎస్సీ నాయకుడు, ప్రస్తుతం టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్ రాజు పేరుకూడా చంద్రబాబు పరిశీలనలో ఉంది. వాస్తవానికి ఎం.ఎస్ రాజు అసెంబ్లీకి వెళ్లాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే శింగనమలను ఎంచుకున్నారు. కాని, ఇక్కడ సమీకరణలు మారాయి. కాంగ్రెస్ నుంచి ఓ కీలక నేత టీడీపీలోకి వచ్చేందుకురంగం రెడీ అయింది. దీంతో ఆయనకు ఇస్తే.. ఇక్కడ గెలుపు తథ్యమని భావించిన టీడీపీ శింగనమల ఆశలు వదులుకోవాలని.. రాజుకుకొన్నాళ్ల కిందటే సూచించింది.
ఈ క్రమంలోనే రాజు.. బాపట్ల పార్లమెంటుపై కన్నేశారు. రాజధాని ప్రాంతం కావడం.. రైతులు అనుకూలంగా ఉండడంతో ఇక్కడ గెలుపు తథ్యమని ఆయన భావిస్తున్నారు. దీంతో ఈయన పేరు కూడా పరిశీలనలో ఉంది. మరోవైపు.. బాపట్ల కోసం.. మరో ముగ్గురు కూడా పోటీలో ఉన్నారు. వీరిలో వైసీపీ నుంచి బయటకు వచ్చిన తాడికొండ ఎమ్మె ల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా ఉన్నారు. ఈమె కూడా.. తనకు న్యాయం చేయాలని.. పార్లమెంటుకు వెళ్తానని పోరు పెడుతున్నట్టు పార్టీలో నాయకులు చెబుతున్నారు.
గత ఎన్నికల్లో ఉండవల్లి తాడికొండ నుంచి వైసీపీ టికెట్పై విజయం దక్కించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో బాపట్ల ఇస్తే.. గెలిచి పార్లమెంటులో అడుగు పెడతానని ఆమె అంటున్నారు. పైగా శ్రీదేవి ఆర్థిక వనరులు కూడా సమకూరుస్తానని.. తాను భారీగా ఖర్చు పెట్టుకుంటానని కూడా చెపుతున్నారు. మరోవైపు.. హరిప్రసాద్, పాలపర్తి మనోజ్కుమార్ లు కూడా.. బాపట్ల సీటు కోరుకుంటున్నారు. ఈ పార్లమెంటు పరిధిలో ఒకటి రెండు సెగ్మెంట్లు మినహా అన్ని చోట్లా టీడీపీ చాలా బలంగా ఉంది. ఈ క్రమంలోనే ఇక్కడ టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా పార్లమెంటులో కూర్చోవడం పక్కా అన్న ధీమా అందరిలోనూ కనిపిస్తోంది. అందుకే బాపట్ల పార్లమెంటు సీటు ఇప్పుడు టీడీపీలో యమాహాటుగా మారింది.