బ్యాంకింగ్ రంగంలో ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కోసం కొత్త నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు రుణ రేట్లు తగ్గిస్తున్నట్టు తన తాజా ప్రకటనలో తెలిపింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) తగ్గించింది. ఎంసీఎల్ఆర్లో 20 బేసిస్ పాయింట్ల మేర కోత విధిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
యూనియన్ బ్యాంక్ MCLR తగ్గింపుతో బ్యాంకు నుంచి రుణం తీసుకున్న వారికి ఈ ప్రయోజనం దక్కనుంది. రుణ రేట్లు కూడా తగ్గనున్నాయి. బ్యాంకు రేట్ల కోత ఈ నెల జూలై11 నుంచి అమల్లోకి రానుంది. నిన్నటివరకూ బ్యాంక్ MCLR రేటు 7.6గా ఉండేది ఇప్పుడు 7.4కు తగ్గింది. ఇందులో.. MCLR రేటు మూడు నెలలకు 7.1 శాతానికి, ఆరు నెలల MCLR రేటు 7.25 శాతానికి క్షీణించాయి. యూనియన్ బ్యాంక్ ఇలా రేటు తగ్గించడం వరుసగా 13వసారి కావడం గమనార్హం.
ఇకపోతే బ్యాంకింగ్ రంగ దిగ్గజం కూడా ఎస్ బీఐ తన MCLR రేటును తగ్గించింది. మూడు నెలలలోపు రేటును 5 నుంచి 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇతర బ్యాంకులైన కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా తమ MCLR రేట్లను తగ్గించాయి.